బానిసలం కాదు: మహీధర్, రాసిస్తే పరిశీలిస్తామని డిగ్గీ
రాసిస్తే పరిశీలిస్తామన్న డిగ్గీ
రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిపై ఈ నెల 30లోగా తేల్చాలని అధిష్ఠానానికి అల్టిమేటమ్ ఇవ్వాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన 9 మంది కేంద్ర మంత్రులు పార్లమెంట్ అనుబంధ భవనంలో సోమవారం భేటీ అయ్యి, పరిస్థితిని సమీక్షించారు. ఆంటోనీ కమిటీ సభ్యులు వారితో మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బుధవారం తర్వాతే వారిని కలుసుకోవాలని మంత్రులు నిర్ణయించారు.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు నిర్ణయించారు. హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి, తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు రాజధానులు ఏర్పాటుచేయాలన్న కావూరి నిర్ణయం సహేతుకంగా ఉన్నదని, దీని వల్ల ఎవరికీ నష్టం జరగదని వారు భావించారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఎక్కువకాలం సాగకుండా 30 లోగా నిర్ణయం తీసుకోవాలని కోరాలని వారు నిర్ణయించుకున్నారు.
కాగా, మంత్రుల అల్టిమేటమ్ తమకు చేరలేదని, వారు లిఖితపూర్వకంగా తమకు ఏమైనా ఇస్తే పరిశీలిస్తామని దిగ్విజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు. మరోవైపు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై ఆహార భద్రత బిల్లు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నట్లు తెలిసింది.