బాధ్యత మా పార్టీదే: గాదె, అఖిలపక్షం ట్విస్ట్ - సస్పెన్స్!
సమన్యాయం అంటున్న వైయస్సార్ కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నినాదం సమైక్యవాదమా లేక విభజననా చెప్పాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో కొత్త పార్టీకి ప్రస్తుతానికి అవకాశాలు లేవని చెప్పారు. తెలంగాణ రాదనుకోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా లేఖ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ హామీ రెండో ఎస్సార్సీ అన్నారు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని, కుదరదంటే అది తెలుగు ప్రజలను వంచించడమే అన్నారు. కాంగ్రెసు పార్టీ ఒక ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. విభజన నిర్ణయం అమానుషం, అన్యాయం, దుర్మార్గమన్నారు. సీమాంధ్రలో ఉద్యమం నేతల ప్రోత్సాహంతో జరగడం లేదని, అది ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమమన్నారు. 226 స్థానాలున్న యూపిఏ తీసుకున్న విభజన నిర్ణయం చట్టబద్దమైనది కాదన్నారు.
అఖిల పక్షం కోసం చర్చలు
కాంగ్రెసు పార్టీ అఖిల పక్షం కోసం సిద్ధమవుతుందా అంటే టిడిపి నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టిడిపి ఎంపీలు ఈ రోజు లోకసభ వాయిదా పడిన అనంతరం మాట్లాడుతూ.. అఖిల పక్ష కమిటీ వేస్తామని కమల్ నాథ్ తమతో చెప్పారని అయితే, కమిటీపై విధివిధానాలు ఇస్తే తాము పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని ఆయనకు చెప్పామన్నారు. తెలంగాణ బిల్లును, తెలంగాణ రాష్ట్రాన్ని తాము అడ్డుకోవట్లేదని, సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమే అన్నారు.
కాగా, జాతీయ స్థాయిలో అఖిల పక్ష కమిటీ కోసం కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఎంపి లగడపాటి రాజగోపాల్, సిపిఐ నేత గురుదాస్ గుప్తా టిడిపి సభ్యుల వద్దకు వెళ్లి అఖిల పక్షంపై చర్చించినట్లుగా సమాచారం. తాము అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతామని వారికి తెలిపినట్లుగా సమాచారం. అయితే, కేంద్రం కొత్తగా తెర పైకి తీసుకు వస్తున్న అఖిల పక్ష సమావేశంపై సస్పెన్స్ ఉందనే చెప్పవచ్చు.
కాంగ్రెసు పార్టీ ఇప్పుడు వేయబోయే కమిటీ విభజన పైననా లేక సీమాంధ్రుల సమస్య పైననా అనేది ఈ రోజు రాత్రికి తేలనుందని సమాచారం. ఇప్పటికే సీమాంధ్రుల సమస్యపై పార్టీ పరంగా ఆంటోని కమిటీని వేశారు. ఇప్పుడు పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న అన్ని పార్టీలతో కలిసి కమిటీ వేయనున్నారు. అయితే ఈ కమిటీతో సమస్య పరిష్కారమవుతుందా లేక కొత్త సమస్యలు తెచ్చి పెడుతుందా అని తర్జన భర్జన పడుతున్నారట.