జగన్ భయంతో: విజయమ్మ, దావూద్తో పోలిక: కెటిఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భయపడే కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం విమర్శించారు. ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా రాష్ట్ర విభజన జరగాలన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర విభజన వద్దని తాము రాష్ట్రపతికి చెప్పామన్నారు. జగన్కు భయపడే రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రం ప్రస్తుతం అగ్ని గుండంలా మారిందన్నారు. రెండు ప్రాంతాల్లో విద్వేషం నింపేలా సిడబ్ల్యూసి నిర్ణయముందన్నారు. విభజన చేయాల్సి వస్తే తండ్రిలా నిర్ణయం తీసుకోవాలనేదే తమ వాదన అన్నారు. విభజన జరిగితే నదీ జలాలు, హైదరాబాదు తదితర సమస్యలకు ఎలా పరిష్కారం చూపిస్తారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భయానక వాతావరణం ఏర్పడిందన్నారు.
జగన్కు వారితో పోలికా?: కెటిఆర్
వైయస్ జగన్ను జాతి గౌరవం పెంచిన మహాత్మా గాంధీ, భగత్ సింగ్లతో పోల్చడం అవమానకరమన్నారు. ఆయనను దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ వంటి వారితో పోల్చాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నడిపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఎన్నో సభల్లో చెప్పారన్నారు. తమతోనే తెలంగాణ వస్తుందని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారని వైయస్ చెప్పారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతున్న సమ న్యాయం అంటే బ్రదర్ అనిల్ కుమార్కు బయ్యారం గనులు రాసివ్వడమా, హైదరాబాదులో జగన్ చేస్తున్న విచ్చలవిడి దోపిడీకి అనుమతులు ఇవ్వడమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అదుపు చేస్తే రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయన్నారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.