తుమ్మల వాహనంపై కాల్పులు: మాణిక్ రెడ్డిపై దాడి

మంగళవారం రాత్రి మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు శివారుల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. డివైడర్ మధ్యలో ఉన్న చెట్ల చాటు నుంచి దుండగులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకుని మాణిక్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై హైదరాబాద్కి బయలుదేరారు.
కొల్లూరు శివార్లలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై దాడి చేయగా, అద్దాలు ధ్వంసమయ్యాయి. మాణిక్ రెడ్డి వాహనాన్ని నిలిపివేసి చూడగా, ఎవరూ కనిపించలేదు. హైదరాబాద్ చేరుకున్న తరువాత ఆయన ఈ విషయాన్ని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఫోన్ ద్వారా తెలిపారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, తన వాహనంపై ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారో అర్థం కావడంలేదని మాణిక్ రెడ్డి తెలిపారు.
ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే... అదే ప్రాంతంలో కొంపల్లి నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వాహనంపైనా దాడి జరిగింది. వాహనంలో తుమ్మల డ్రైవరు పక్క సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో పీఏ తిలక్, తుమ్మల అనుచరుడు నాగేశ్వరరావు ఉన్నారు. కిటికీ అద్దాలు పగిలి తిలక్, నాగేశ్వరరావు స్వల్పంగా గాయపడ్డారు.
ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డులో మాణిక్ రెడ్డి వాహనంపైనా దాడి జరిగిన విషయం టీవీల ద్వారా తుమ్మల నాగేశ్వరరావుకు తెలిసింది. దీంతో అనుమానం బలపడి తమ వాహనాన్ని మరింతగా పరీక్షించారు. వాహనం డోర్ మీద బుల్లెట్ తగిలిన గుర్తును గమనించారు. దీనిపై తుమ్మల పీఏ తిలక్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో తుమ్మల అంగరక్షకులు కూడా వాహనంలో లేనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications