మార్చుకుంటారా.. వెళ్లాలా?: లేఖ యోచనలో మంత్రులు
న్యూఢిల్లీ: విభజన విషయంలో మనసు మార్చుకుంటారా? లేక మమ్మల్ని వెళ్లమంటారా? అని కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు పలువురు కేంద్రమంత్రులు, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వారు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీకి విభజనపై పునరాలోచించుకోవాలని లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, పళ్ళం రాజు, కావూరి సాంబశివ రావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలతో పాటు ఎనిమిది మంది ఎంపీలు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారట. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ప్రజలు రోడ్ల పైకి వస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాము పదవుల్లో కొనసాగడాన్ని వారు హర్షించరని వారు లేఖలో పేర్కొననున్నారని తెలుస్తోంది.

సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెంటనే సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, విభజనపై అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయని, కాంగ్రెసు పార్టీ కూడా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని వారు లేఖలో కోరనున్నారట.
విభజనపై కాంగ్రెసు పార్టీ పునరాలోచించకుంటే ప్రజల్లోకి వెళ్లలేమని, విభజనపై నిర్ణయం మార్చుకుంటారా? లేక తమను పదవులు వదిలి వెళ్లమంటారా? అని లేఖలో ప్రశ్నించనున్నారట. తాము పార్టీని కాదనలేమని అయితే, పరిస్థితులు చేదాటాయని చెప్పనున్నారు. సమైక్య రాష్ట్రమే దేశానికి, పార్టీకి మంచిదని చెప్పనున్నారు.
ఆ ముగ్గురు దూరం
అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు చిరంజీవి, పురంధేశ్వరి సహా పలువురు కేంద్రమంత్రులు, సీమాంధ్ర ఎంపీలు సిద్ధమవుతుండగా దీనికి కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, జెడి శీలం, పనబాక లక్ష్మిలు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు తమను నిలదీయడంతో కేంద్రమంత్రులు పునరాలోచనలో పడి అధిష్టానానికి లేఖ సంధించాలనే నిర్ణయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications