8 చోట్ల రెక్కీ: రాత్రి నిద్రలేని భత్కల్, 12 రాష్ట్రాల విజ్ఞప్తి
వారిని ఢిల్లీ పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టారు. బీహార్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. బీహార్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతోందన్నారు.
అంతకుముందు వారికి బీహార్లోని మోతీహారి జిల్లా న్యాయస్థానం మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండును విధించింది. కాగా, హైదరాబాదులో పేలుళ్లు జరిపేందుకు భత్కల్, అక్తర్లు కలిసి ఎనిమిది చోట్ల రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో పాటు బీహార్ బుద్ధగయ పేలుళ్లలోను వీరి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బుద్దగయ పేలుళ్లలో వీరి పాత్రను అధికారులు ఖండిస్తున్నారు.
హైదరాబాదులో పలు రెక్కీ నిర్వహించిన వీరిని నగరానికి తీసుకు వచ్చేందుకు ఎపి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గురువారం రాత్రి యాసిన్ భత్కల్ పాట్నా జైలులో నిద్రలేమితో గడిపినట్లుగా బీహార్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం ఎన్ఐఏ అదికారులు భత్కల్ను ప్రశ్నించారు. తదపరి విచారణకు భత్కల్ను ఢిల్లీకి తరలించారు. భత్కల్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి పన్నెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.