తెలంగాణ ప్రక్రియ ఆగదు: జానా, తెరాస క్లోజ్: జగ్గారెడ్డి
హైదరాబాద్/ నల్లగొండ : తెలంగాణ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. ఆయన శనివారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు, సంఘాలు సహకరించాలని కోరారు. సమ్మె విరమించాలని ఏపీ ఎన్జీవోలను సీఎం కోరాలని, తెలంగాణలో సమ్మె జరిగినప్పుడు విరమించాలని తాము కోరామని జానా గుర్తు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగదని భావిస్తే రెండు ప్రాంతాల సభకు అనుమతివ్వాలని, లేదంటూ ఎవరికీ అనుమతివద్దని మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన జరిగే వేల చంద్రబాబునాయుడు వైఖరిపై కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. బాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని మానుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు చేపట్టబోయే ఆత్మగౌరవ యాత్రలో సీమాంధ్ర ప్రజలకు రెండు రాష్ట్రాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆయన సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష చేయడం సమంజసం కాదని గుత్తా విమర్శించారు.
త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్పు ఖాయమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు పి. శంకరరావు అన్నారు. మార్పులన్నీ గతంలో సెప్టెంబర్లోనే జరిగాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. డిసెంబర్ 9వ తేదీనాటికి తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని, అలా పూర్తి కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు.
చంద్రబాబునాయుడు మామను వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడ్డారని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు బస్సు యాత్ర చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదని, ఆత్మవంచన యాత్ర... ఆత్మద్రోహ యాత్ర అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను, వైఖరి మార్చుకున్నానని చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెరాస క్లోజ్
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పని అయిపోయిందని, 2014 నుంచి ఆ పార్టీకి కష్టాలేనని కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తాను అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగానే ఓటు వేస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ కాంగ్రెసుకే దక్కుతుందని, అయితే ఓట్లు వస్తాయో రావో తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో బిజెపి కూడా వ్యతిరేకించవచ్చునని ఆయన అన్నారు. తెరాస కాంగ్రెసులో విలీనమైనా కెసిఆర్ తెరాస నేతలను రోడ్డు పడేస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజస్వామ్యంలో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఉందని, ముఖ్యమంత్రిని వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు.