నాకైతే భయమేసింది: జగన్ దీక్షపై భార్య భారతి
హైదరాబాద్: తన భర్త, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆరోగ్యం విషమిస్తుంటే తనకైతే భయమేసిందని వైయస్ భారతి వ్యాఖ్యానించారు. కోర్టు అనుమతితో నిమ్స్లో వైయస్ జగన్ను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యం విషమిస్తుంటే భయం వేయడం లేదా అని తాను అడిగితే సమయం వచ్చినప్పుడు స్పందించాలని కదా అని జగన్ అన్నారని ఆమె తెలిపారు. బలవంతంగా వైద్యులు జగన్కు ఫ్లూయిడ్స్ ఎక్కించారని, తాను చూడలేకపోయానని, జగన్ దీక్ష భగ్నమైనట్లేనని ఆమె అన్నారు.
జగన్ రక్తనమూనాలను తీసుకున్నారని, పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆరోగ్యం గురించి తెలుస్తుందని ఆమె అన్నారు. షుగర్, బిపి, పల్స్ రేటు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. రెండు మూడు రోజులు వైద్యులను జగన్ను తమ పర్యవేక్షణలో ఉంచుకోవచ్చునని ఆమె అన్నారు. జైలు అధికారుల ఆదేశాలను జగన్కు చూపించి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారని ఆమె చెప్పారు.
వైయస్ జగన్తో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. దీక్ష విరమించాలని తాము ఎంతగా చెప్పిన జగన్ వినలేదని ఆమె అన్నారు. వీల్ చైర్ పెట్టినా నిన్న తాను నడుస్తానని జగన్ అన్నారట అని, ఒక్క రోజులోనే ఎంతో తేడా వచ్చిందని ఆమె అన్నారు. ఎల్లుండి నుంచి షర్మిల బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, జగన్ ఆస్పత్రిలో ఉన్నారు కాబట్టి తాను వెళ్తానో లేదో అని ఆమె అన్నారు.
మొన్న రాత్రే పిల్లలు జగన్ను చూడాలని అనుకున్నారని, తమకే జగన్ను ఆ రోజు చూడడానికి వీలు కాలేదని, వారిని ఎలా తెస్తామని ఆమె అన్నారు. ఈ రోజు పిల్లలను తెస్తానంటే మీడియావాళ్లుంటారు, వద్దని జగన్ అన్నారని ఆమె చెప్పారు. డాక్టర్లు ఎక్కడివారైనా వారికి పేషంట్లందరూ ఒక్కటేనని, బాగానే చూసుకుంటారని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. నిమ్స్ దేశంలోని అత్యంత ఉత్తమమైన సంస్థల్లో ఒకటని, మంచి వైద్యమే అందుతుందని ఆమె అన్నారు.