లగడపాటిని నిలదీసిన విద్యార్థులు: ఆపుతామని హామీ
తనకు రాజకీయాలు వద్దని, సమైక్యాంధ్ర కావాలని, అందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని లగడపాటి చెప్పారు. చట్టసభల్లో సమైక్యవాదం వినిపించడానికే ఇంకా పదవుల్లో ఉన్నామని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బిల్లును అడ్డుకోవాల్సి ఉందని, వ్యూహం ప్రకారం ముందుకు పోతున్నామని, చట్టసభల్లో తెలంగాణ తీర్మానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
రాజీనామా చేసి రావడం తనకు పెద్ద పని కాదని, గతంలో తాను రాజీనామా చేసి తిరుగుబాటు చేశానని, కేవలం నాలుగు నెలల కోసం పదవిలో ఉండే వ్యక్తిని కానని ఆయన చెప్పారు. విభజనపై పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వం నిర్ణయం చేయాల్సి ఉందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఆపడానికి తాము పదవుల్లో ఉన్నామని, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం చేస్తే పార్లమెంటులో బిల్లును అడ్డుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను ఇదివరకే చెప్పాని, తనకు వ్యక్తిగత ప్రతిష్ట,త నాయకత్వం అక్కర్లేదని ఆయన అన్నారు. ఉద్యమ తీవ్రతను తాము ఢిల్లీలో చూపిస్తున్నామని, విభజనపై మనసు మార్చుకోవాలని అన్ని పార్టీలను కోరుతున్నామని, సమైక్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఉండకుండా విజయవాడలో కూర్చుకుంటే విభజనను ఆపలేమని ఆయన అన్నారు. విభజనపై ముందుకు వెళ్లకుండా ఆపగలిగామని, ఇంకా ప్రమాదం ఉంది కాబట్టి నిలువరించాలని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయినా, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఇదివరకే రాజీనామాలు కూడా సమర్పించామని చెప్పారు.