అడ్డుకునే అస్త్రాల్లో ఇదొకటి: హరీష్, వ్యతిరేకంకాదు కానీ
ఎపిఎన్జీవోల సభ ఆ విష ప్రయోగంలో ఒకటిగా భావిస్తున్నామన్నారు. సభ ద్వారా అక్కడి వారే అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయన్నారు. గతంలో ఆ చరిత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం అక్కడి వారి హైదరాబాదులో మతకల్లోహాలు సృష్టించారని ఆరోపించారు. శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముప్పుగా మారారని ఆరోపించారు. కిరణ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సీమాంధ్ర సిఎంగా పని చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు సమావేశాలు, సభలు పెట్టుకుంటే లాఠీఛార్జిలు, గృహనిర్బంధాలు, ముళ్లకంచెలు వేసిన వారు ఎపిఎన్జీవోల సభకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఎపిఎన్జీవోల సభ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే అన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణవాదులు సీమాంధ్రులు ఎంత రెచ్చగొట్టినా ఉద్రేకపడవద్దన్నారు. వారి బుట్టలో పడొద్దన్నారు. శనివారం నాటి బందుకు తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం మొదటి నుండి తెలంగాణవాదులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ఈటెల అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని కోరారు. సభలకు తాము వ్యతిరేకం కాదని అయితే, తమ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తమ గడ్డ పైన పెట్టే సభకు తాము వ్యతిరేకమన్నారు. ఆ కారణంగానే తాము రేపు అర్ధరాత్రి వరకు బందును విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.
అశోక్ బాబు తమ దగ్గర ఆత్మహత్యలుండవని, హత్యలుంటాయని చెప్పడం దేనికి సంకేతమని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బరితెగించి ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారన్నారు. వారు స్పందించకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సీమాంధ్రలోని కొన్ని వర్గాలు విభజనకు అనుకూలంగా ర్యాలీలు చేస్తే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కొందరు సీమాంధ్రులు హైదరాబాదు గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికీ అత్మహత్యలు కొనసాగుతున్నాయని, నిన్న కూడా సికింద్రాబాదులో ఆత్మహత్య చేసుకున్నారని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడబోతున్న ఇలాంటి సమయంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమకారులను కుంగదీసినట్లవుతుందని, ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తెలంగాణ వస్తుందని చెప్పారు.