ఏపీలో కరోనా టెర్రర్: 12,926 కేసులు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 43,763 శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో 12,926 మందికి కరోనా సోకింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,959 కేసులు వచ్చాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు వచ్చాయి. ఇతర జిల్లాల్లోనూ భారీగా కొత్త కేసులు గుర్తించారు.
Recommended Video
3,913 మంది కరోనా నుంచి కోలుకోగా.. కరోనా సోకిన ఆరుగురు చనిపోయారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,538కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,66,194 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,78,513 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 73,143కి పెరిగింది.
కరోనాతో విశాఖపట్టణంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 73 వేల 143 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యశాఖ పేర్కొంది.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
కేసులు పెరగడంతో పొరుగు రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. తమిళనాడు, కేరళ ఆదివారం పూర్తిగా లాక్ డౌన్ విధిస్తాయని ప్రకటించాయి. ఇటు ఢిల్లీ మాత్రం కేసులు తగ్గుతున్నాయి.. వీకెండ్ కర్ప్యూను ఎత్తివేస్తామని ప్రకటించాయి. టాప్ సైంటిస్ట్ మాత్రం ఒమిక్రాన్తో వైరస్ అంతం అవుతుందనే సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇదీ మానవాళికి కాస్త సానుకూలం అంశమే అయ్యింది.