ప్రశాంతంగా ఏపీ మున్సిపల్ ఎన్నికలు, ఎస్ఈసీ నిమ్మగడ్డ హ్యపీ
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు కూల్గా జరిగాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ఎన్నికల సరళిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేషన్లలో 57.41 శాతం, మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ జరగడం సంతోషకరమైన విషయం అని చెప్పారు.
ఒక్క చోట కూడా రీపోలింగ్ లేకుండా మున్సిపల్ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అని నిమ్మగడ్డ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు జరగడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పోలింగ్ కు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను నివేదికలను ఇవ్వాలని కోరామని తెలిపారు. ఈ నెల 14న కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ప్రకటిస్తామని అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ బలపరచిన అభ్యర్థులే విజయం సాధించారు. టీడీపీ కాస్త ప్రభావం చూపించింది. బీజేపీ/ జనసేన పత్తా లేకుండా పోయాయి. ఇక ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.