వంకాయ, క్యారెట్, కుర్చీ.. ఇవీ ఏపీ పంచాయతీ గుర్తులు, 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం..
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 4వ తేదీ ఉపసంహరణకు తుది గడువు.. ఆ తర్వాత సర్పంచ్/ వార్డు సభ్యులకు గుర్తులు కేటాయిస్తారు. ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు అతీతమనే సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు రకరకాల గుర్తులను కేటాయిస్తున్నారు. దాదాపు 25 వరకు గుర్తులను ఎస్ఈసీ ఆమోదం తెలిపారు. వారికి ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ నెల 9వ తేదీన తొలి విడత పంచాయతీ పోరు జరగనుండగా.. 7వ తేదీ సాయంత్రం 4 గంటల్లో ప్రచారం పర్వం ముగియనుంది.

ఇవే గుర్తులు..
అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసర, తేనీరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష పండ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, బ్లాక్ బోర్డ్, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులు ఉన్నాయి. గుర్తులకు కాదేది అనర్హం అనే స్థాయిలో పంచాయతీ పోరులో నిలిచే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.

వ్యాపారులు రెడీ
ఎస్ఈసీ ఆమోదం తెలిపిన గుర్తులకు అనుగుణంగా సామాగ్రిని రూపొందించే పనిలో వ్యాపారులు సిద్దమయ్యారు. వారి అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇదేమని అడిగితే తమకు ఇదే సమయం అని కొందరు చెప్తుండటం విశేషం. ఈ నెల 7వ తేదీన తొలి విడత ప్రచార పర్వం ముగియనుండగా.. స్వల్ప సమయంలోనే గుర్తులను అందించాల్సి ఉంది. తమపై పని ఒత్తిడి ఉందని వారు అంటున్నారు. అందుకోసమే కాస్త ధర అటు ఇటుగా ఉంటుందని చెబుతున్నారు.
Recommended Video

వరస పర్యటనలు
మరోవైపు ఎస్ఈసీ వరసగా పర్యటనలు చేస్తున్నారు. మొన్న రాయలసీమలో పర్యటించగా.. ఇవాళ విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష చేయబోతున్నారు.రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ చర్చలు జరుపుతారు.












Click it and Unblock the Notifications