ఫీజు బాదితే కఠిన చర్యలు.. ప్రైవేట్ దోపిడీ, అధికారులకు సీఎం జగన్ స్పష్టీకరణ
కరోనా వైరస్ పీక్కి చేరినట్టే అనిపిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కేసులు పెరగడంతో ఆస్పత్రులు ఇదే సమయం అని భావిస్తున్నాయి. అడ్డంగా దోచేయాలని ప్లాన్ చేస్తాయి. దానికి మూకుతాడు వేసే పనిలో ఉన్నారు సీఎం జగన్. ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బులు గుంజితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్పై నిర్వహించిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీచేశారు. రోగులెవరైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాలనుకుంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా ధరలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు.
బోర్డులపై ప్రదర్శించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రజలకు వివరించాలని సీఎం చెప్పారు. రోగులకు ఎక్కడా బెడ్ల కొరత రాకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ వివరాలు అధికారుల దగ్గర ఉండాలని సూచించారు. 104 కాల్ సెంటర్కు మరింత ప్రాచుర్యం కల్పించాలని.. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఫోన్ చేస్తే వారికి తగిన సలహాలివ్వాలని జగన్ సూచించారు.
ఫోన్ చేసిన 3 గంటల్లోగా బెడ్ కేటాయించాలని.. అవసరమైన దానికంటే ఆక్సిజన్ ఎక్కువ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ల కోసం మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. నిన్న ఒకేరోజు సుమారు ఆరున్నర లక్షల మందికి వ్యాక్సిన్ అందించడంపై అధికారులను అభినందించారు.