పల్లె పిలుస్తోంది..! పట్నం కదులుతోంది..!! రవాణ వ్యవస్థ రెడీ అంటోంది..!!!
Recommended Video
హైదరాబాద్/ అమరావతి : నగరం ఇప్పుడు యాంత్రిక జీవనానికి మారుపేరు. దైనందిన కార్యక్రమాలతో విసుగెత్తిన పట్టణ జీవి అప్పుడప్పుడు కాస్త ఉపశమనం కోరుకోవడం సర్వసాధారణం. అలాంటి సందర్బంలో మీకు స్వాంతన కలిగించేందుకు మేము ఉన్నామని పల్లెటూళ్లు ఆప్యాయంగా పలకరిస్తుంటాయి. ఎప్పుడూ కాకపోయినా సంక్రాంతి లాంటి పర్వదినం సందర్బంగా పుట్టి పెరిగిన సొంత గ్రామానికి రావాల్సిందే అంటూ పల్లెటూర్లు పలకరిస్తుంటాయి.
అందుకోసం వందల కిలోమీటర్ల దూరంలో, ఎప్పుడో వదిలి పెట్టిన తమతమ పచ్చని సొంత గ్రామలను జ్ఞాపకం చేసుకుంటుంటారు నగర వాసులు. అంతే కాకుండా ఓ వారం రోజుల పాటు అన్ని ఒత్తిడిలు మర్చిపోయి స్వగ్రామాల్లో, స్వగ్రుహ వంటకాలతో హాయిగా గడిపి వస్తుంటారు పట్నం వాసులు..!! అలా గ్రామాలకు తరలి వెళ్లే వారికోసం రెండు తెలుగు రాష్ట్రాల రవాణా వ్యవస్థలు సౌకర్యాలు కల్సించడంలో నిమగ్నమయ్యాయి.
సంక్రాంతికి స్వాగతం పలుకుతున్న గ్రామాలు..! రెడి అవుతున్న పట్నం వాసులు..!!
మకర సంక్రాంతికి పల్లెలు ముస్తాబవుతున్నాయి. సొంత ఊళ్లు నగరంలో ఉన్న తమ ఆత్మీయులను రా..రమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. అందుకోసం పట్నం వాసులు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ప్రయాణీకుల సౌకర్యం కోసం రోడ్డు రవాణా సంస్థలు తమతమ కార్యాచరణలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ దాదాపు 5వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాయి.
ఖాళీ కాబోతున్న నగరం..! లక్షల సంఖ్యలో గ్రామబాట పట్టనున్న ప్రజలు..!!
విస్త్రుత ఏర్పాట్లు చేస్తున్న రెండు రాష్ట్రాల ఆర్టీసి..! అసౌరకర్యం ఉండదంటున్న అదికారులు..!!
రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమన్వయ సమావేశం నిర్వహించగా, వీలైనన్ని ఎక్కువ బస్సులను అందుబాటులో ఉంచాలని, గత సంవత్సరంతో పోలిస్తే మరిన్ని బస్సులను ప్రయాణికుల సౌకర్యార్ధం కేటాయించాలని నిర్ణయించారు. గతేడాదిలో 3,200 బస్సులను తిప్పామని గుర్తు చేసిన అధికారులు, ఈ సంవత్సరం రద్దీ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తూ, బస్సుల సంఖ్యను పెంచినట్టు తెలిపారు. ప్రతి యేటా సుమారు యాబై లక్షల జనం సంక్రాంతికి తమతమ సొంత గ్రామాలకు తరలి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా పెద్ద యెత్తున ప్రజలు ఏపితో పాటు తెలంగాణ పల్లెలకి తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అదికారులు అంచనా వేస్తున్నారు.
ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు..! అంచనా వేస్తున్న ఆర్టీసి యాజమాన్యం..!!
ఈ సంక్రాంతి సీజన్ లో 12వ తేదీ శనివారం, 13 ఆదివారం రావడంతో రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. రోజుకు 1000కి తక్కువ కాకుండా బస్సులను సిద్ధం చేస్తామని, ఏ ప్రాంతానికి డిమాండ్ ఉంటే, అక్కడికి అదికంగా బస్సులను పంపుతామని టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎల్బీ నగర్ లోని చింతలకుంట నుంచి బయలుదేరుతాయని అధికారులు తెలిపారు.
ఆఫర్లను నమ్మి మోసపోవద్దు..! సమగ్ర సమాచారం కోసం ఆర్టీసి కౌంటర్లు..!
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లే బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నడిపిస్తామని అన్నారు. కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కడప, చిత్తూరు బస్సులు ఎంజీబీఎస్ నుంచి, వరంగల్ బస్సులు ఉప్పల్ నుంచి బయలుదేరుతాయని తెలిపారు. ప్రయాణీకులు ఎవరూ కూడా గందరగోళానికి లోను కాకుండా తగిన సమాచారాన్ని పొందేందుకు ప్రత్యేక సమాచార సెంటర్లను ఏర్పాటు చేసినట్టు అదికారులు తెలిపారు. నిర్దేశించిన ఛార్జీలకంటే అదనంగా ఎవరైనా వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చని కూడా అదికారుల స్పష్టం చేసారు.