కరెంట్ బిల్లుల వాత: ప్రజలపై పెనుభారం, చంద్రబాబు విసుర్లు
అసలే కరోనా కాలం.. బతకడమే కష్టం.. అవును.. అంతగా మార్కెట్ లేకపోవడంతో.. నిత్యావసరాలు.. తిండి తప్ప మిగతా ధ్యాస లేదు. చాలా రంగాలపై పెను ప్రభావం పడింది. ఈ సమయంలో కరెంట్ బిల్లుల మోత తప్పడం లేదు. డిస్కం ఛార్జీలు, యూజర్ చార్జీలు అంటూ ముక్కుపిండి మరీ బాదుతున్నారు. ఏపీలో ఇటీవల కొందరికీ భారీగా చార్జీలు వచ్చిన ఘటనలు చూశాం. దీనిపై విపక్షాలు స్పందించాయి.
ఏపీలో మాత్రం ట్రూ అప్ చార్జీల పేరుతో కరెంట్ బిల్లుల వడ్డనపై విపక్షాలు మండిపడుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై సీఎం జగన్ పెనుభారం మోపారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొంటున్నారని ఆరోపించారు. ఆ భారం ప్రజలపై మోపడం సరికాదని కామెంట్ చేశారు. విద్యుత్ ను సరిగా ఉత్పత్తి చేయించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ప్రభుత్వమే మటన్ షాపులు నిర్వహిస్తుందనే సీఎం జగన్ మాటలు రాష్ట్రమంత హాస్యాస్పదంగా మారాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే మాంస షాపులు నిర్వహించడం ఏంటీ అని అడిగారు. వైసీపీ నేతలు దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మైనారిటీలు, క్రిస్టియన్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోయాయని అన్నారు. ఇదీ సరికాదు అని.. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరారు. అలా కాదు కొందరికే పట్టం కడతామని అంటే కుదరదని చెప్పారు.
ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేయడానికి సీఎం జగన్ కుట్ర పన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రేషన్, పెన్షన్లు తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. ఇలా చేసి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాల్సిందేనని.. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు. భవిష్యత్తులో గ్రామాల్లో కూడా చెత్త, పారిశుద్ధ్యంపై పన్నువేస్తారని చంద్రబాబు సెటైర్లు వేశారు. వీటన్నింటికీ జరుగుతున్నట్టే వాటికి వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జగన్ సర్కార్ ఇకనైనా తీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజలను అమాయకులు అనుకోవద్దని సూచించారు.