శ్రీవారికి రూ. 5కోట్ల ఆభరణాలు: కెసిఆర్ మొక్కులకు నిధులు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆయా దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మొక్కుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆయన తన మొక్కులను తీర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ మొక్కులు తీర్చేందుకు ప్రస్తుతానికి రూ. 59 లక్షలు కేటాయిస్తూ జీవో జారీ అయింది.
ఈ నిధులతో వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి 2 కిలోలతో బంగారు కిరీటం, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 15 గ్రాముల ముక్కు పుడక, విజయవాడ కనక దుర్గమ్మకు 15 గ్రాముల ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి 25 గ్రాముల బంగారు మీసాలు చేయిస్తారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఆభరణాలు చేయించేందుకు రూ. 5 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు
నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో యాదగిరి గుట్ట అభివృద్ధిపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గుట్ట అభివృద్ధిపై రూపొందించిన నమూనాలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
యాదగిరి గుట్ట వారసత్వ ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వందేళ్ల నాటి పురాతన దేవాలయాన్ని తలపించే విధంగా గుట్ట డిజైన్ రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. దేవాలయం ఎలివేషన్లో అద్భుతమైన శిల్పకళలు ఉండాలని సీఎం సూచించారు. యాదగిరి గుట్ట దేవాలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పారు.
పంజాబ్లోని అమృత్సర్ దేవాలయం ఉత్తర భారతదేశంలోని అక్షర్ధామ్ ఆలయాల నిర్మాణాలను అధ్యయనం చేసి డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. గుట్టలో సెంట్రలైజ్డ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, గుట్టపైకి వెళ్లేందుకు రెండు లైన్ల రహదారిని నిర్మించాలని సూచించారు.
యాత్రికుల సౌకర్యం కోసం విశ్రాంతి గదులు, వసతి గృహాలు, సకల సౌకర్యాలతో భక్తులకు బస ఏర్పాట్లు చేయాలన్నారు. గుడి చుట్టూ ఉన్న 10 ఎకరాల స్థలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణమండపం, యాగశాల ఏర్పాటు చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్రావు, స్తపతి సౌందర్య రాజన్, ఆర్కిటెక్ట్లు పాల్గొన్నారు. త్వరలోనే స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్రావు నేతృత్వంలో యాదగిరిగుట్ట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.