ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం- రేపటి నుంచి 1-9వ క్లాసులకు సెలవులు
ఏపీలో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ పరీక్షలపై సస్పెన్స్ వీడిపోయింది. పరీక్షలను ఈ ఏడాది యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కోవిడ్ నిబందనలతో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష అనంతరం ప్రకటన చేశారు.
ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు ప్రస్తుతం దాదాపు 7 వేల కొత్త కేసులు వస్తున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏఫీ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. అయితే ఇవాళ దీనిపై విద్యాశాఖ, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పరీక్షలు నిర్వహించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.
Recommended Video
రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపినట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ విద్యార్ధులకు రేపటి నుంచి సెలవులు ప్రకటించాలని నిర్ణయించామన్నారు.