ఏపీలో పెరిగిన కరోనా కేసులు, తగ్గిన మరణాలు: 15వేలు దాటిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, 1500కుపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 67,911 నమూనాలను పరీక్షించగా.. 1608 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1608 కరోనా కేసులు, ఆరుగురు మృతి
తాజాగా నమోదైన 1608 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,27,650కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,970కి పెరిగింది.

ఏపీలో 15,119 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1107 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,98,561కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 15,119 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,72,29,781 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 14 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 34, చిత్తూరులో 281, తూర్పుగోదావరిలో 213, గుంటూరులో 141, కడపలో 126, కృష్ణాలో 161, కర్నూలులో 18, నెల్లూరులో 261, ప్రకాశంలో 114, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 70, విజయనగరంలో 14, పశ్చిమగోదావరిలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,87,533, చిత్తూరులో 2,40,344 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,579) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలోనూ కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అంతకుముందు రోజుకంటే గత 24గంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 17.87 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 34,973 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు రోజు(43,263)తో పోలిస్తే దాదాపు 8వేల కేసులు తక్కువగా ఉన్నాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. మరణాలు కూడా మరోసారి 300 దిగువన నమోదయ్యాయి. గురువారంనాడు 260 మంది కరోనాతో బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,42,009కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,681 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.23 కోట్లకు పెరిగింది.
రికవరీ రేటు 97.49 శాతంగా ఉంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,90,646 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గురువారం 67,58 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు 72.37 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో 60 శాతానికి పైగా కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గురువారం కేరళలో 26,200 కరోనా కేసులు నమోదు కాగా.. 125 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 22,126కు పెరిగింది. పాజిటివిటీ రేటు 16.69 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications