దారుణం: ఇంటర్ విద్యార్ధినిపై అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి కాల్చి చంపారు..?
విశాఖపట్నం: ఇంటర్ చదివే విద్యార్ధిని అనుమాస్పద స్ధితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన జిల్లాలోని గోలుగొండ మండలం పుత్తిడిగైరంపేట గ్రామ శివారులోని అప్పన్నపాలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సూరాడ తాతారావు భార్య మంజుల, ముగ్గురు పిల్లలతో జీడిమామిడి తోటలో నివాసం ఉంటున్నారు. చిన్న కుమార్తె, కుమారుడు వేరే చోట చదువుకుంటున్నారు. పెద్ద కుమార్తె దివ్యశ్రీ (18) మాత్రం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
తండ్రి తాతారావు ఆటో నడుపుతుండగా, తల్లి మంజుల నర్సీపట్నంలోని ఓ దుస్తుల షాపులో పనిచేస్తోంది. దివ్యశ్రీతోపాటు తల్లి, తండ్రి రోజు ఉదయం నర్సీపట్నం వెళుతుంటారు. మంగళవారం అనారోగ్యం కారణంగా దివ్యశ్రీ కాలేజికి వెళ్లలేదు. తల్లి, తండ్రి తమ తమ పనులకు వెళ్లిపోయారు.
మంగళవారం రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కూతురు కోసం వెతికారు. జీడి మామిడి తోటలో కూతురు శవం కాలుతూ కనిపించింది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన నర్సీపట్నం రూరల్ సీఐ గపూర్, గొలుగొండ ఎస్సై జోగారావు అనుమానాస్పద మృతిగా కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు దివ్యశ్రీ కాలిన విధానం చూస్తే ఎవరో అత్యాచారం చేసి ఆపై ఇంటి వద్దకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దివ్యశ్రీ కాలిపోయే సందర్భంలో కదలకుండా ఒకే చోట ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు.