ఏపీలో 20వేలకుపైనే కరోనా కేసులు : ఆ ఒక్క జిల్లాలోనే 3వేలకుపైగా, 1.82లక్షలకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా ఒక్క రోజు వ్యవధిలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,10,147 నమూనాలను పరీక్షించగా.. 21,954 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు, 72 మరణాలు
తాజాగా నమోదైన 21,954 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,28,186కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 72 మంది మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 11 మంది చనిపోగా, తూర్పుగోదావరిలో 9, విజయనగరంలో 9, అనంతపురంలో 8, ప్రకాశంలో 6, చిత్తూరు 5, గుంటూరులో 5, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళంలో జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ఇద్దరు మృతి చెందారు. తాజా మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8446కు చేరింది.

ఏపీలో లక్షా80వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,141 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,37,411కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,82,329 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,70,60,446 కరోనా నమూనాలను పరీక్షించారు. కాగా, గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3531 కేసులు నమోదు కాగా, కృష్ణాలో అల్పంగా 548 మంది కరోనా బారినపడ్డారు. 12 జిల్లాల్లోనూ వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదు కావడం ఏపీలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.

ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1871, చిత్తూరులో 2354, తూర్పుగోదావరిలో 3531, గుంటూరులో 1348, కడపలో 1130, కృష్ణాలో 548, కర్నూలులో 1920, నెల్లూరులో 1292, ప్రకాశంలో 1666, శ్రీకాకుళంలో 1939, విశాఖపట్నంలో 2107, విజయనగరంలో 1160, పశ్చిమగోదావరిలో 1088 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు. ఇక ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే సేవలందించనున్నాయి. ఆ తర్వాత ప్రజా రవాణాతోపాటు ప్రైవేటు వాహనాల సేవలు కూడా బంద్ కానున్నాయి. మే 5 నుంచి 12 గంటల తర్వాత రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేస్తున్నారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వచ్చేవారు అక్కడే నిలిచిపోతున్నారు.












Click it and Unblock the Notifications