ఏపీ జిల్లాల్లో కరోనా కల్లోలం: 23వేలకుపైగా కొత్త కేసులు, 83 మరణాలు, లక్షా50వేలకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్లో తొలిసారి ఆదివారం 23వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,14,299 నమూనాలను పరీక్షించగా.. 23,920 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు
తాజాగా నమోదైన 23,920 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,45,022కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 83 మంది మృతి చెందారు. కరోనాబారినపడి తూర్పుగోదావరిలో 12 మంది, విశాఖపట్నం, అనంతపురం, కృష్ణాలో 8 మంది చొప్పున, ప్రకాశం, విజయనగరంలో ఏడుగురు చొప్పున, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఆరుగురు చొప్పున, గుంటూరులో ఐదుగురు, కర్నూలులో నలుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8136కు చేరింది.
ఏపీలో లక్షా50వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 11,411 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,93,708కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,43,411 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,66,02,873 కరోనా నమూనాలను పరీక్షించారు.
ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1303, చిత్తూరులో 2945, తూర్పుగోదావరిలో 2831, గుంటూరులో 2384, కడపలో 1055, కృష్ణాలో 989, కర్నూలులో 2516, నెల్లూరులో 1011, ప్రకాశంలో 1378, శ్రీకాకుళంలో 2724, విశాఖపట్నంలో 1938, విజయనగరంలో 849, పశ్చిమగోదావరిలో 1997 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఆంక్షలను విధించింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదు. కాగా, మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.