తిరుపతి నామినేషన్లకు ముగిసిన గడువు- 14 మంది ఇండిపెడెంట్లు సహా 34 మంది
తిరుపతి ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తదుపరి ప్రక్రియపై దృష్టిసారించారు. నామినేషన్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ నివేదిక ప్రకారం తిరుపతిలో మొత్తం 34 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో 14 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు.
తిరుపతిలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల నుంచి మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో వైసీపీ తరఫున గురుమూర్తితో పాటు ప్రగడ అన్నపూర్ణ, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, శీలం తిరుపయ్య, బీజేపీ నుంచి కత్తి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతామోహన్, సీపీఎం నుంచి నెల్లూరు యాదగిరి, గడ్డం అంకయ్య నామినేషన్లు దాఖలు చేశారు. వీరు కాకుండా ఎన్నికల సంఘం వద్ద నమోదైన పార్టీల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి, ఇండియా ప్రజాబంధు పార్టీ, హిందుస్ధాన్ జనతా పార్టీ, నవతరం పార్టీ, మహాజన రాజ్యం పార్టీ, ఐరా నేషనల్ పార్టీ, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, జనవాహిని పార్టీ, ప్రజా ఎక్తా పార్టీ, ఫార్వాడ్ బ్లాక్ కూడా నామినేషన్లు వేశాయి.

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వీటిని పరిశీలించి బరిలో ఉండే తుది అభ్యర్ధులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖరారు చేస్తారు. అనంతరం వాస్తవంగా పోటీలో ఉండే అభ్యర్ధులెవరో తేలిపోనుంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్సభ స్ధానంలో ఉప ఎన్నిక జరగనుంది. బరిలో ఎంతమంది ఉన్నా అంతిమంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్ధుల మధ్యే పోటీ ఉండనుంది. అందులోనూ వైసీపీ, టీడీపీ మధ్యే అసలు పోటీ ఉండబోతోంది. దీంతో ఈ రెండు పార్టీలకు గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ త్వరలో పొరుగు రాష్ట్రాల నేతలు, జాతీయ నేతలను ప్రచారానికి తీసుకురానుంది.













Click it and Unblock the Notifications