జగన్కు షాకివ్వనున్న మరో 4గురు ఎమ్మెల్యేలు?: ఆ పనిలో సీఎం, భూమా, ‘బడ్జెట్’ తర్వాతే!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో నలుగురు ఎమ్మెల్యేలు షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం వారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఓ టీడీపీ సీనియర్ నేత పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ విషయమై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు మూడురోజుల్లోగా ఆయా జిల్లాల పార్టీ నేతలను తనను కలవాలని సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల చేరికలపై చర్చించిన అనంతరం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 10మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది నలుగురికే పరిమితమైనట్లు సమాచారం. మిగితా వారు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి టీడీపీలో చేరే అంశంపై సంపూర్ణ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులో ఉన్నట్లు తెలిసింది.

కాగా, సుమారు 10మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే నలుగురు మాత్రం అతి త్వరలో టీడీపీలో చేరతారని ఆ పార్టీ ఎంపీ ఒకరు తెలిపారు. జిల్లాల నేతలతో చర్చించిన అనంతరం వీరి చేరికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ప్రకాశం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం వీరి చేరికలుండే అవకాశం ఉందని సమాచారం.
ఇది ఇలా ఉండగా, మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినప్పటికీ.. ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాకపోవడం గమనార్హం.
కాగా, త్వరలోనే తెలుగుదేశం పార్టీ సుమారు 4వేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో పలువురు నేతలకు పదవులు దక్కనున్నాయి.












Click it and Unblock the Notifications