తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి...8 మందికి తీవ్ర గాయాలు
తూర్పుగోదావరి:జిల్లాలోని సామర్లకోట సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు నలుగురు మహిళలు ఉన్నారు. మృతులు కాకినాడ రూరల్ మండలం రామేశ్వరం వాసులుగా గుర్తించారు. వీరంతా ఒక శుభకార్యానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు నాగమణి(35), మంగ(36), లక్ష్మి(35), కమల(35), మూడేళ్ల బాలుడు పండు, ఆటో డ్రైవర్ జోగేంద్ర (50)గా గుర్తించారు. ప్రమాదంపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు...
కాకినాడ గ్రామీణ మండలం రామేశ్వరానికి చెందిన 15 మంది పెద్దాపురం మండలం వడ్లమూరులో జరిగిన ఓ వివాహ శుభకార్యానికి హాజరై రాత్రి వేళే ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. వీరు సాంబమూర్తి రిజర్వాయర్ సమీపంలోని 5 తూముల వద్ద వీరి ప్రయాణిస్తున్న ఆటోను ఒక టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాలాది నాగమణి(35), నొక్కు కమలమ్మ(35), పండు(3), ఇంద్రపాలెనికి చెందిన ఆటోడ్రైవర్ పెంకె రాజు(50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా...అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
అయితే ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ ను గుర్తించేందుకు పోలీసు అధికారులు నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. సామర్లకోట, రంగంపేట, పిఠాపురం, పెద్దాపురం ఎస్సైలను అప్రమత్తం చేసి వాహనాన్ని గుర్తించేందుకు బృందాలను పంపించారు. అయితే ఈ టిప్పర్ లారీ సిరామిక్ పరిశ్రమ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లు రంగంపేట పోలీసులు గుర్తించి వెంటనే వారు స్థానిక సీఐకు సమాచారం అందించారు. పోలీసులు టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని సామర్లకోట పోలీసుస్టేషన్కు తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే హోంమంత్రి చినరాజప్ప అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.