7గురు ఎమ్మెల్సీలు టిడిపిలోకి: లిస్ట్లో జగన్ పార్టీ నేత
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన ఏడుగురు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. రెండు రోజుల కిందట.. శాసనసభలో తమకు ప్రాతినిధ్యం లేకపోయినా మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి ఎమ్మెల్సీలు షాకిచ్చారు. శనివారం ఏడుగురు తెలుగుదేశానికి జైకొట్టగా... ఆదివారం మరొకరు సైకిల్ ఎక్కనున్నారని తెలుస్తోంది. మరికొందరు వారి దారిలోనే ఉన్నారట.
తద్వారా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిపై పట్టు సాధించే దిశగా టిడిపి అడుగులు వేస్తోంది. మండలి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. మండలి ఉపాధ్యక్ష పదవికి టీడీపీ అభ్యర్థిగా శనివారమే పార్టీ తీర్థం పుచ్చుకున్న చైతన్యరాజును ఎంపిక చేసింది. ఏడుగురు ఎమ్మెల్సీలు శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
మరో ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి ఆదివారం చేరనున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన లేఖను ఫ్యాక్సు చేశారట. ఎమ్మెల్సీలతోపాటు జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శేషాద్రినాయుడు కూడా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. సైకిలెక్కిన ఎమ్మెల్సీల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, పుల్లయ్య, గాదె శ్రీనివాసులు నాయుడు, పట్టభద్రుల కోటా నుంచి రవివర్మ, గవర్నర్ కోటా నుంచి షేక్ హుస్సేన్, బి ఇందిర, రెడ్డప్ప రెడ్డి, ఎమ్మెల్యే కోటా నుంచి లక్ష్మీ శివకుమారి ఎంపికయ్యారు.
వీరిలో చైతన్య రాజు స్వతంత్రంగా ఎన్నికయ్యారు. మిగిలిన వారంతా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఉండటం ఇష్టం లేదని పేర్కొన్న షేక్ హుస్సేన్ శుక్రవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే వారం జరగనున్న మండలి ఉపాధ్యక్ష ఎన్నికలో గెలుపు సాధించాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఖాళీలు పోను మండలిలో ప్రస్తుతం 39 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
వీరిలో టిడిపి తరపున గెలిచినవారు ఏడుగురు ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి టిడిపిలో చేరారు. శనివారం మరో ఏడుగురు సైకిల్ ఎక్కారు. ఆదివారం టీడీపీలో చేరుతున్నానని మరో ఎమ్మెల్సీ రెడ్డప్ప రెడ్డి ప్రకటించారు. వీరితో కలిపి మండలిలో టిడిపి సంఖ్యా బలం 16కు చేరింది. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా సైకిలు ఎక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిలో వాకాటి నారాయణ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, ఐలాపురం వెంకయ్య తదితరులు ఉన్నారట.
కౌన్సిల్ ఉపాధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీనిని గెలుచుకోవాలని టిడిపి గట్టి ప్రయత్నాల్లో ఉంది. కొత్తగా వచ్చినవాళ్లు కాకుండా ఇద్దరు ముగ్గురు గైర్హాజరు అయ్యేలా చూసుకుంటే టిడిపి ఈ పదవిని గెలుచుకునే అవకాశముంటుంది. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కలిస్తే మాత్రం పోటీ ఇచ్చే అవకాశముంది. ఆ 2పార్టీలు కలిస్తే ప్రజలకు అదే చెబుతామని, వారి మధ్య అవగాహన ఈ రకంగా బయటకొస్తుందని, అవి కలిసినా తమ గెలుపును ఆపలేరంటున్నారు.