బంగారం షాపులో భారీ చోరీ.. 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42 లక్షలు దోపీడీ..
అసలే లాక్డౌన్.. మార్కెట్ కూడా అంతగా లేదు. ఇంతలో బంగారం కొంటామని కొందరు వచ్చారు. భారీగా నగలు అడగడంతో ఆ వ్యాపారులు లోలోన సంతోషపడ్డారు. కానీ వచ్చింది దొంగలు అని తెలిసి విస్తుపోయారు. విజయవాడలో శుక్రవారం పట్టపగలే దోపీడీ జరిగింది. గుమస్తాపై దాడి చేసి భారీగా బంగారం, నగదును దోచుకెళ్లారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
నగలు కొంటామని వచ్చి..
పాతబస్తీ కాటూరివారి వీధిలో నగల దుకాణంలో ఇవాళ భారీ దోపిడీ జరిగింది. పాతబస్తీ శివాలయ వీధిలో జ్యువెల్లరీ వ్యాపారి శ్యామ్కు నగల షాపు ఉంది. కాటూరివారి వీధిలో వెండి వస్తువులు విక్రయించే షాపులో షేర్ ఉంది. ఉదయం ఇద్దరు వ్యక్తులు శివాలయం వీధిలో గల షాపునకు నగలు కొనేందుకు వచ్చారు. అయితే లాక్ డౌన్ వల్ల కాటూరివారి వీధిలో నగలు ఉన్నాయని కాసేపు వెయిట్ చేయించారు.
నగలు తీసుకెళ్లేందుకు వెళ్లి..
మరో వ్యాపార భాగస్వామి మనోహర్ సింగ్ చెప్పడంతో గుమాస్తా విక్రమ్ సింగ్ నగలు తీసుకొచ్చేందుకు కాటూరివారి వీధిలో గల దుకాణం వద్దకు వచ్చారు. అయితే అప్పటికే ఉన్న మరికొందరు దాడి చేశారు. ఎంతకీ రాకపోవడంతో మరో గుమస్తాను పంపించగా.. విక్రమ్ సింగ్ అపస్మారక స్థితిలో గాయాలతో కనిపించాడు. అతని సమాచారంతో యజమాని మనోహర్ సింగ్.. తన వ్యాపార భాగస్వామి శ్యామ్కు విషయాన్ని తెలియజేశారు. దీంతో శ్యామ్, మరో పార్ట్నర్ రాజాసింగ్, మనోహర్ సింగ్ ఘటనా స్థలానికి వచ్చారు.
బంగారం, నగదు చోరీ
తమ షాపులో 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42 లక్షల నగదును దోచుకెళ్లారని శ్యామ్ తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ విభాగం వారు సంఘటనా స్థలం నుంచి వేలిముద్రలు సేకరించారు. దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్ానరు. గుమస్తాగా పనిచేస్తున్న విక్రమ్ సింగ్పై అనుమానిస్తున్నారు. అతను రెండునెలల క్రితమే షాపులో పనికి చేరాడు.