ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు-విజయవాడలో గవర్నర్ సమక్షంలో ప్రమాణం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన జడ్జీలతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదించడంతో వీరంతా హైకోర్టు జడ్డీలుగా నియమితులయ్యారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్డీలతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొత్తం ఏడుగురు నూతనంగా ప్రమాణం చేయగా, వారిలో నలుగురు న్యాయమూర్తులుగా, ముగ్గురు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇవాళ జరిగిన కార్యక్రమంలో ముందుగా జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధా కృష్ణ కృపా సాగర్, జస్టిస్ శ్యాంసుందర్ బండారు, జస్టిస్ శ్రీనివాస్ వూటుకూరు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జున రావు, దుప్పల వెంకట రమణ ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆర్.ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.