కేసీఆర్కు షాక్.. ట్యాపింగ్ నిజం!: కీలక ఆధారాల సేకరణ, నారాయణ పిల్
విజయవాడ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ సిట్ సర్వీస్ ప్రొవైడర్లతో జరిపిన విచారణ మంగళవారం పూర్తయింది. ట్యాపింగ్ జరిగినట్లుగా సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, సాంకేతికపరమైన అంశాలు ఇప్పుడే చెప్పలేమని, కాల్ డేటా ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.
మళ్లీ విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సర్వీస్ ప్రొవైడర్లకు సూచించారు. కాగా, మంగళవారం సాయంత్రం వరకు యూనినార్, ఎయిర్ టెల్, ఐడియా, డొకోమో, రిలయన్స్ తదితర ఎనిమిది కంపెనీల సర్వీస్ ప్రొవైడర్లు విచారణకు హాజరయ్యారు.
ఇప్పుడే వివరాలు చెప్పలేం: ఎస్పీ
ట్యాపింగ్ కేసుకు సంబంధించి చేపడుతున్న విచారణకు ఇప్పటివరకు ఎనిమిది మంది టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు హాజరయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్పీ జి శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో సిట్ బృందం విచారణ కొనసాగిస్తోంది.
సోమవారం ప్రారంభమైన విచారణ ఈ రోజు కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని విచారించినట్లు సిట్ ఎస్పీ చెప్పారు. దర్యాప్తు జరుగుతున్నందున ఎక్కువ వివరాలు వెల్లడించలేమని తెలిపారు. విచారణ రిపోర్టును అధికారులకు అందజేస్తామని చెప్పారు.
ఇద్దరు సీఎంలపై కోర్టుకెక్కిన నారాయణ
సీపీఐ జాతీయ నేత నారాయణ కోర్టులో పిల్ వేశారు. ఏపీ, టీఎస్ సీఎంలు, స్పీకర్లు, ఎన్నికల కమిషన్ పైన పలు ఆరోపణలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు, స్పీకర్లు, ఈసీల నిర్లక్ష్య ధోరణితో అవినీతి పెరిగిందన్నారు. గత 15 ఏళ్లుగా ఈసీ వద్ద పలు కేసులు పెండింగులో ఉన్నాయని, వాటి కారణంగానే ఎన్నికల్లో అవినీతి చోటు చేసుకుంటోందన్నారు.
పలు పార్టీలు చేసిన ఫిర్యాదులను స్పీకర్లు పట్టించుకోవడం లేదని, అధికార పార్టీలకు కొమ్ము కాస్తున్నారని, అందుకే ఫిర్యాదులు నీరుగారిపోతున్నాయని పేర్కొన్నారు. సీఎంలే స్వయంగా అవినీతిక దన్నుగా ఉన్నారని ఆరోపించారు.