జగన్ కేబినెట్లో 80 శాతం మంది అవుట్-పేర్నినాని క్లారిటీ-అదృష్టవంతులెవరు ? ఫిఫ్టీ ఫీఫ్టీ ఎవరు ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ తో రెండున్నరేళ్లు పూర్తవుతాయి. సీఎం జగన్ ముందుగానే కేబినెట్ మంత్రులకు చెప్పినట్లుగానే 80 శాతం మంది మంత్రుల్ని కేబినెట్ నుంచి తప్పించేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందులో పేర్నినానితో పాటు పలువురు మంత్రులు పదవులు కోల్పోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పేర్నినాన్ని నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యల్లో చెప్పేశారు. దీంతో మిగిలిన 20 శాతం మంత్రులు అంటే ఆ ఐదుగురు అదృష్టవంతులు ఎవరనే చర్చ మొదలైంది.

త్వరలో జగన్ కేబినెట్ ప్రక్షాళన
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఈ డిసెంబర్ తో రెండున్నరేళ్లు పూర్తికాబోతున్నాయి. అయితే ఈ ల్యాండ్ మార్క్ ల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తి చేసుకోగానే 80 నుంచి 90 శాతం మంది మంత్రుల్ని మార్చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పేశారు. భారీ ఎత్తున గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్ మంత్రి పదవుల్లో న్యాయం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రెండున్నరేళ్లు ముగిసే డిసెంబర్లో మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతోంది. ఇందులో ఎవరు ఉంటారు, ఎవరు ఊడతారనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

లిస్ట్ సిద్ధం చేస్తున్న జగన్
కేబినెట్ మంత్రుల్లో ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనే దానిపై సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో సామాజిక వర్గాలు, జిల్లాలు, ప్రాంతీయ సమీకరణాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల టికెట్లతో పాటు కేబినెట్ సమీకరణాల విషయంలోనూ లెక్క తప్పని రికార్డు ఉన్న జగన్.. ఈసారి కూడా అదే స్ధాయిలో సమీకరణాల ప్రకారం మంత్రివర్గ ప్రక్షాళన జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

80 శాతం ఉద్వాసన ఖాయమన్న పేర్నినాని
ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ఉన్న వారిలో ఎంతమందికి ఉద్వాసన పలుకుతారన్న దానిపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ఇందులో 80 శాతం మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని కొందరు, లేదు 90 శాతం అని ఇంకొందరు, లేదు లేదు మొత్తం 100 శాతం మంత్రుల తొలగింపూ ఖాయమని మరికొందరూ చర్చించుకుంటున్నారు. దీంతో అసలు జగన్ మనసులో ఏముందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్నినాని వచ్చే డిసెంబర్లో 80 శాతం మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని తేల్చిచెప్పేశారు.

తనకూ మినహాయింపు లేదన్న పేర్ని నాని
అదే సమయంలో కేబినెట్ ప్రక్షాళనలో తన మంత్రి పదవి ఉద్వాసన కూడా ఖాయమని పేర్నినాని వెల్లడించారు. డిసెంబర్లో కేబినెట్ ప్రక్షాళనలో 80 శాతం మంది మంత్రుల ఉద్వాసన తప్పదని, అందులో తాను కూడా ఉంటానని, అయితే సమాచార మంత్రిగా ప్రస్తుతం మీడియా ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న తాను.. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోరాటం చేస్తానని పేర్నినాని చెప్పుకొచ్చారు. దీంతో పేర్ని నాని సహా 80 శాతం మంది ఉద్వాసనకు జగన్ రంగం సిద్ధం చేసేసినట్లు తేలిపోయింది. అప్పుడు ఆ 80 శాతం మందిలో ఇంకెవరు ఉన్నారనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

పెద్దిరెడ్డి, బొత్స, మేకపాటి, బుగ్గన కొనసాగే ఛాన్స్
జగన్ గతంలో చెప్పిన లెక్క ప్రకారం 80 శాతం మంత్రులు అంటే ఐదుగురు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ ఐదుగురు ఎవరన్న దానిపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జగన్ కేబినెట్లోని మంత్రుల్లో సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరు కీలకమైన శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం, వివాదాలకు దూరంగా ఉండటం, ఇప్పటికే మొదలుపెట్టిన మూడు రాజధానులు, ఎన్నికలు, అప్పులు, ఆర్ధిక వ్యవహారాలు, పరిశ్రమల విషయాలను కొనసాగించేందుకు వీరి అవసరం తప్పనిసరిగా ఉండటం వంటి అంశాలు వీరికి ప్లస్ కాబోతున్నాయి. వీరితో పాటు మరో ఒకరిద్దరికి కూడా కొనసాగింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు ఈ నలుగురిలో ఒకరికి పొడిగింపు ఉండకపోవచ్చు.
Recommended Video

కేబినెట్లో 50-50 ఛాన్స్ వీరికే ?
జగన్ కేబినెట్లో ప్రస్తుతం ఉన్న వారిలో హోంమంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, వ్యవసాయ మంత్రి కన్నబాబు, బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు మరో ఒకరిద్దరికి కొనసాగింపు-ఉద్వాసన విషయంలో 50-50 ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న దిశ చట్టం, మహిళలపై దాడుల నేపథ్యంలో హోంమంత్రి సుచరితకు జగన్ కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి తన సొంత సామాజిక వర్గం నుంచి పెద్దగా పోటీ లేకపోవడం ప్లస్ కానుంది. రాజన్నదొర, బాలరాజు, కళావతి వంటి ఎస్టీ ఎమ్మెల్యేల నుంచి పోటీ ఉన్నా అంతిమంగా పుష్పశ్రీవాణికే జగన్ ఓటు వేయొచ్చని తెలుస్తోంది. అలాగే దాదాపు ఏడు శాఖలు మోస్తున్న వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రస్తుతం అనిల్ చూస్తున్న ఇరిగేషన్ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో రైతుల కోసం జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన మెరుగ్గా ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి కావాల్సి ఉంది. దీంతో కన్నబాబును కొనసాగించేందుకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications