పుష్కర పయనం: మొత్తం 825 ప్రత్యేక రైళ్లు, అత్యధికం రాజమండ్రికే
రాజమండ్రి: గోదావరి పుష్కరాల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 825 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు, అదనపు బెర్తులు తదితర వివరాలతో మొత్తం సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచామని రైల్వే సీపీఆర్ఓ తెలిపారు.
రెండు రాష్ట్రాల్లో 7 స్టేషన్లను పుష్కర రద్దీ స్టేషన్లుగా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలోని బాసర, భద్రాచలం రోడ్, మంచిర్యాల, రామగుండం, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు రైల్వే స్టేషన్లను అత్యధిక రద్దీగా ఉండే స్టేషన్లుగా గుర్తించింది. ఈ ఏడు స్టేషన్లలో 25వ తేదీ వరకు పార్సిల్ బుకింగ్లపై నిషేధం ప్రకటించింది.
ఏపీలోని కొవ్వూరు, గోదావరి, రాజమండ్రికి 78 రిజర్వేషన్, 379 రిజర్వేషన్ లేని రైళ్లు, నరసాపురానికి 46 రిజర్వేషన్ లేని రైళ్లు, తెలంగాణ లోని బాసరకు 222 రిజర్వేషన్ లేని రైళ్లు, మంచిర్యాల, రామగుండానికి 56 రిజర్వేషన్ లేని రైల్లు, భద్రాచలం రోడ్కు 6 రిజర్వేషన్, 38 రిజర్వేషన్ లేని రైళ్లు నడపనున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా స్టేషన్లలో తాగునీరు, అదనపు మరుగుదొడ్లు, వెయిటింగ్ హాళ్లు, బుకింగ్ కౌంటర్లు, విచారణ కౌంటర్లు, ఆహార పానీయాలు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు, సామన్లు భద్రపరచే గదులు, ప్రథమ చికిత్స, ప్రత్యేక వైద్య సిబ్బంది, నిఘాకెమెరాలు తదితర సదుపాయాలు కల్పించింది.
ఏపీలోని రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు రైల్వే స్టేషన్లకు 457, నర్సాపురం స్టేషన్కు 46 ప్రత్యేక రైళ్లు నడపుతోంది. గోదావరి రైల్వే స్టేషన్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న సబ్వేకు అదనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ప్రత్యేక రైళ్ల వివరాల టైం టేబుల్ పుస్తకాలను మంగళవారం దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ విడుదల చేశారు.
అన్ని రైల్వే స్టేషన్లలోని స్టాల్స్లో ఈ టైం టేబుల్ పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నట్టు, ఈ పుస్తకాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభ్యమవుతాయని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల ప్రయాణికులపై దక్షిణమధ్య రైల్వే మేళా సర్చార్జీ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సెకండ్ క్లాస్/స్లీపర్ క్లాస్ టికెట్పై రూ.5, ఏసీ 3టైర్/ఏసీ చైర్కార్పై రూ.10, ఏసీ 2టైర్ /ఫస్ట్క్లాస్కు రూ.15, ఫస్ట్ ఏసీ తరగతిపై రూ.20చొప్పున ప్రతి టికెట్పై వసూలు చేస్తున్నట్లు సీపీఆర్వో ఉదయ్శంకర్ తెలిపారు. 825 ప్రత్యేక రైళ్లలో 17.80లక్షల బెర్త్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రక్షణ సహాయానికి 182 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేయాలని సూచించారు.