ఘోరం: పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు
గుంటూరు: బాపట్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అమర్నాథ్ స్నేహితుడే నిందితుడు కావడం గమనార్హం. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత బాలుడి స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి మరికొందరితో కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలలం రేపింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకు చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్కు వెళుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా వెళుతుండగా.. మార్గం మధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి మరికొంతమందితో కలిసి అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.

మంటలు అంటుకుని బాలుడు కాపాడాలంటూ హాహాకారాలు చేస్తుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే మంటలు ఆర్పివేసి.. అతడ్ని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్రగాయాలపాలైన ఆ బాలుడు మృతి చెందాడు. తనపై వెంకటేశ్వర్ రెడ్డి, మరికొందరు పెట్రోల్ పోసి నిప్పంటించారని చనిపోయేముందు పోలీసులకు అమర్నాథ్ వాంగ్మూలం ఇచ్చాడు.
ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని మృతుడి తాత రెడ్డయ్య తెలిపారు. దీనిపై అమర్నాథ్ నిలదీయడంతోనే వెంకటేశ్వర్ రెడ్డి కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.
గతంలో కూడా అమర్నాథ్పై నిందితుడు దాడి చేశాడని తెలిపారు. దీనిపై అమర్నాథ్ కుటుంబ సభ్యులు వెంకట్రెడ్డిని మందలించడంతోపాటు తల్లిదండ్రులకు చెప్పగా.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై మరింత కక్షపెంచుకుని ఇవాళ మళ్లీ దాడి చేసినట్లు అమర్నాథ్ తెలిపాడని బంధువులు వివరించారు. అమర్నాథ్ మృతితో అతని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.












Click it and Unblock the Notifications