వీడియో: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం పెద్దగా వేచి ఉండనక్కర్లేదు. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.
సోమవారం 68,601 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 23,396 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 5.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఈ నెలలో స్వామివారి విశేష ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు.

కాగా- తిరుమలలో ఎలుగుబంటి కనిపించడం భక్తులను ఒకింత ఆందోళనకు గురి చేసింది. తిరుపతి- తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఓ ఎలుగుబంటి తిరుగాడింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెట్ల మార్గాన్ని దాటుతూ కనిపించింది ఈ ఎలుగుబంటి. అలిపిరి మెట్ల మార్గంలో ఉండే జింకల పార్కు సమీపంలో ఈ ఎలుగుబంటి దర్శనం ఇచ్చింది.
అర్ధరాత్రి కావడం వల్ల ఆ సమయంలో అలిపిరి మెట్ల మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న భక్తుల సంఖ్య పెద్దగా లేదు. తిరుమలకు వెళ్తోన్న ఒకరిద్దరు భక్తులు తమ మొబైల్ ఫోన్లల్లో ఈ ఎలుగుబంటిని చిత్రీకరించారు. అనంతరం దీన్ని వాట్సప్ ద్వారా టీటీడీ అటవీ విభాగం సిబ్బందికి పంపించారు. సమాచారం అందుకున్న వెంటనే వారు జింకల పార్కు వద్దకు చేరుకున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి హల్ చల్ pic.twitter.com/mdJOxFHpev
— oneindiatelugu (@oneindiatelugu) August 1, 2023
గతంలో మెట్లమార్గం ఏడో మైలు వద్ద ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని టీటీడీ అధికారులు ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. చికిత్సకు అయిన ఖర్చును వారే భరించారు. పూర్తిగా కోలుకున్న తరువాత డిశ్చార్జ్ అయ్యాడు. మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు తీసుకుంటామని అన్నారు.
శేషాచలం కొండల్లో టీటీడీ ఆధీనంలో సుమారుగా 2,280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అనేక రకాల వన్యప్రాణులకు శేషాచలం కొండలు ఆవాసంగా మారాయి. జింకలు, ఎలుగు బంట్లూ, చిరుతలు, ఏనుగులు, పునుగు పిల్లులు వంటివి ఉన్నాయి. ఏటా వేసవి కాలంలో కొన్ని వన్యప్రాణులు మంచినీటి కోసం అడవి నుంచి జనసమ్మర్థం ఉండే ప్రాంతాలకు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణ కల్పిస్తుంటారు అధికారులు.












Click it and Unblock the Notifications