అప్పు తిరిగివ్వమన్నందుకు దంపతుల దారుణ హత్య
ప్రకాశం: ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ దంపతులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను ఊరి చివర పూడ్చిపెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక గోరంట్ల మల్టీప్లెక్స్ రోడ్డులో నివాసం ఉండే పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు.. మంగమూరు రోడ్డువాసి శ్రీనివాసరావుకు రూ.15లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది.
ఈ బకాయి తీర్చాలని ఒత్తిడి చేయడంతో రుణం తీసుకున్న శ్రీనివాసరావు, ఆయనతో సన్నిహితులైన రెడ్డెమ్మ, కుమార్లతో కలిసి.. పల్లపోతు శ్రీనివాసరావు, ఆయన భార్య ప్రమీలారాణిలను గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి తొలుత పల్లపోతు శ్రీనివాసరావుకు ఫోన్ చేసి బయటకు పిలిపించిన నిందితులు.. కారులో తీసుకువెళ్లి గొంతు కోసి హతమార్చారు.
అనంతరం ఆయన భార్యకు ఫోన్ చేసి కారులో ఎక్కించుకుని తీసుకువచ్చి.. ఆమెను కూడా గొంతు కోసి హత్య చేశారు. ఒంగోలు శివారులో జాతీయ రహదారి పక్కన గొయ్యి తీసి దంపతులు ఇద్దరినీ ఒకే చోట పూడ్చిపెట్టినట్లు తెలిసింది.
ప్రమీలారాణి సోదరుడు సన్నిధి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఒంగోలు రెండో పట్టణ పోలీసులు.. వారిద్దరూ హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతదేహాలను గురువారం వెలికితీసే అవకాశం ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.