బాత్రూంలో విద్యుత్ షాక్తో విద్యార్థిని మృతి: విద్యార్థినులను చితకబాదిన వార్డెన్
పశ్చిమగోదావరి: జిల్లాలోని ఎలమంచిలి మండలం ఇలపకుర్రు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ బాత్రూంలో విద్యుత్ షాక్తో ఆరో తరగతి విద్యార్థిని మౌనిక మృతి చెందింది. విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్లనే బాత్రూంలో విద్యుత్ షాక్కు విద్యార్థిని బలైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినులను చితకబాదిన వార్డెన్
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల వసతి గృహంలో ఉన్న 23మంది విద్యార్థినులను వార్డెన్ ప్రతిమ చితకబాదారు. చెప్పకుండా హాస్టల్ గోడ దూకి పారిపోయారంటూ ఆగ్రహంతో ఆమె విద్యార్థులపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. వార్డెన్ చితకబాదడంతో పలువురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. దీంతో వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు సదరు వార్డెన్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రేమ పేరుతో మోసం
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువులో ప్రేమ పేరుతో ఓ యువకుడు 14ఏళ్ల బాలికను మోసం చేశాడు. గర్భవతైన బాలికను గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా ఆ యువకుడు చిత్రహింసలు పెడుతున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోసగించిన యువకుడిపై గిరిజన యువతి ఫిర్యాదు
విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం గంగవరంలో ఓ యువకుడు గిరిజన యువతిని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చాక మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. గిరిజన యువతితో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమైన యువకుడిపై బాధితురాలు నర్సీపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆర్డీవో దీనిపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
బాలికపై అత్యాచారయత్నం
విశాఖ జిల్లా ఆనందపురంలో ఓ బాలికపై ప్రసాద్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిబందితుడు ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.