మురుగు కాలువలో పసికందు, కరచిన పందికొక్కులు: ఆస్పత్రిలో చేర్పించారు(ఫొటోలు)
విశాఖపట్నం: నెలైనా నిండని ఓ పసికందును నగరంలోని ఓ మురుగు కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే కేజీహెచ్కు తరలించారు. శిశువు వయసు 1-2 రోజులు ఉంటుందని కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ మధుసూదనబాబు
మురుగునీటిలో ఉండటం, పందికొక్కులు కరవడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున ఇప్పుడే ఆరోగ్య స్థితిని చెప్పలేమని కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ మధుసూదనబాబు తెలిపారు. అయితే ప్రస్తుతం శిశువు పరిస్థితి కొంత నిలకడగానే ఉందని చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖ పాతనగరం రెల్లివీధి సమీపంలోని కుంచుమాంబ ఆలయాన్ని ఆనుకొని ఉన్న మురుగు కాలువలో బుధవారం ఉదయం 5 గంటల సమయంలో చావు బతుకుల మధ్య ఉన్న ఓ పసికందు స్థానికుల కంట పడింది.
కాలువలోకి దిగి శిశువును బయటకు తీశారు. పందికొక్కులు శిశువు కుడికాలి బొటనవేలిని కొరకడంతో రక్తం కారుతోంది. గాయాలతో విలవిల్లాడుతున్న ఆ పసికందుకు స్థానికులు తక్షణ సపర్యలు చేసి కేజీహెచ్కు తీసుకొచ్చారు.
ఆస్పత్రి పిల్లల వార్డు విభాగంలోని ఎన్ఐసీయూ ఫొటోథెరపి బల్లపై ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. రక్తం కారుతున్న చోట్ల కట్టుకట్టి పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం ఉదయంతో పోల్చితే సాయంత్రానికి శిశువు ఆరోగ్యస్థితి కొంత మెరుగైందని వైద్యులు తెలిపారు.