భారత్ దెబ్బకు ట్రంప్ భజనలో మునిగిన పాక్ ప్రధాని!
అగ్రరాజ్యం అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను సంతోష పెట్టేందుకు పాకిస్తాన్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాజాగా ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగిన ఓ సాదాసీదా కార్యక్రమానికి కూడా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఆయన ప్రసంగిస్తూ.. అమెరికాపై ప్రశంసల వర్షం కురిపించారు. గతేడాది భారత్తో జరిగిన సైనిక ఘర్షణ సమయంలో ట్రంప్ చేసిన సాయాన్ని తాము ఎప్పటికీ మరచిపోలేమని.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందని పాక్ ప్రధాని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ దెబ్బ.. మారిన పాక్ విదేశాంగ నీతి
గతేడాది కాలంగా పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్ దెబ్బ నుంచి కోలుకోలేకపోతోంది. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. భారత్ ఈ చర్యకు 'ఆపరేషన్ సింధూర్' అని పేరు పెట్టింది. 4 రోజుల పాటు సాగిన ఈ తీవ్ర ఉద్రిక్తతల అనంతరం మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఈ సంక్షోభం సమయంలో డొనాల్డ్ ట్రంప్ సకాలంలో జోక్యం చేసుకుని అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించడం వల్లే యుద్ధం ముగిసిందని.. తద్వారా లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ట్రంప్ను తాము ఎప్పటికీ 'శాంతి దూత'గా గుర్తుంచుకుంటామని షెహబాజ్ షరీఫ్ కొనియాడారు.

భారత్ ఖండన.. పాక్ ఆర్మీ చీఫ్ చొరవతోనే కాల్పుల విరమణ
డొనాల్డ్ ట్రంప్ పట్ల షెహబాజ్ షరీఫ్ చూపించిన కృతజ్ఞతా భావం పూర్తిగా వాస్తవాలకు దూరంగా.. కేవలం అమెరికాను కాకాపట్టే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక ఘర్షణల తర్వాత భారత్-పాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో తానే కీలక పాత్ర పోషించానని ట్రంప్ కూడా పలుమార్లు వ్యాఖ్యానించడం విశేషం. అయితే భారత ప్రభుత్వం ఈ వాదనలను ఎప్పటికప్పుడు నిరభ్యంతరంగా తిరస్కరించింది. ఈ శాంతి ఒప్పందం రెండు దేశాల మధ్య నేరుగా జరిగిందని, ఇందులో ఏ థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం వహించలేదని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్వయంగా చొరవ తీసుకుని అభ్యర్థించడం వల్లే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ తేల్చి చెప్పింది.
8 దశాబ్ధాల ప్రత్యేక బంధం.. ఇరాన్-అమెరికా మధ్య రాయబారం
ఇదే వేదికపై షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు దాన్ని గుర్తించిన మొదటి దేశాలలో అమెరికా ఒకటని గుర్తుచేశారు. గత 8 దశాబ్దాలుగా ఉభయ దేశాల మధ్య భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇంధన రంగాలలో అద్భుతమైన సహకారం ఉందని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి పాకిస్తాన్ రాయబార పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొనడం హాస్యాస్పదం. ఈ శాంతి ప్రయత్నాలలో కీలక పాత్ర పోషిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్-అమెరికా వివాదంలో తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పాకిస్తాన్ చాలా కాలంగా చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం దీనివల్ల ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications