మధురవాడలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతిపై దాడి, అడ్డొచ్చిన తల్లి హత్య!
విశాఖపట్నం జిల్లా మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వయంకృషి నగర్ లో ఒక యువతి పైన, ఆమె తల్లి పైన ఒక ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో యువతిపైన దాడి చేసిన వ్యక్తి అడ్డొచ్చిన తల్లిని కూడా హతమార్చాడు. మధురవాడలో గత కొంతకాలంగా నవీన్ అనే వ్యక్తి దీపిక అనే యువతిని ప్రేమిస్తున్నానని వేధింపులకు పాల్పడుతున్నాడు. అయితే దీపిక నవీన్ ప్రేమను నిరాకరించింది.
ప్రేమ పేరుతో యువతిపైన, ఆమె తల్లిపైన దాడి
దీంతో ఈరోజు మధ్యాహ్నం దీపిక ఇంటికి నేరుగా వెళ్లిన నవీన్ ఆమెపైన దాడికి పాల్పడ్డాడు. దీపిక పైన, ఆమె తల్లి పైన విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. దీపిక గొంతు కట్ చేసిన నవీన్, ఈ దాడిలో అడ్డొచ్చిన యువతి తల్లి లక్ష్మీ పైన కూడా దాడి చేశాడు. దీంతో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి లక్ష్మీ మృతి చెందింది.

పరారీలో నవీన్ .. పట్టుకున్న పోలీసులు
ప్రస్తుతం నవీన్ పరారీలో ఉన్నాడు. శ్రీకాకుళంలో నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు, నవీన్ ను పట్టుకున్నట్లు సమాచారం. నవీన్ ను పట్టుకోవడానికి శ్రీకాకుళానికి ఒక ప్రత్యేకబృందాన్ని పంపించారు. శ్రీకాకుళంలో నిందితుడు బూర్జ మండలంలో అదుపులోకి తీసుకున్నట్టు సిపి బాగ్చి తెలిపారు. అయితే వీరిద్దరి ప్రేమవ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుసని పెళ్లి కూడా చేయాలని భావించారని, కానీ అబ్బాయి ప్రవర్తన నచ్చక మళ్లీ విరమించుకున్నారని సీపీ తెలిపారు.
దీపికకు ఆస్పత్రిలో చికిత్స, తల్లి మృతి
ఇక ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్న విశాఖ సిపి ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో గొంతు కట్ అయిన దీపికను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రేమోన్మాది దాడి ఘటనలో దీపిక తల్లి లక్ష్మీ మృతిచెందగా , యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక విశాఖలో ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
చంద్రబాబు, హోం మంత్రి ఏమన్నారంటే
బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాడిని అడ్డుకునే క్రమంలో దీపిక తల్లి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ప్రేమోన్మాది దాడి ఘటన పైన ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాగ్చీ తో ఫోన్లో మాట్లాడిన వంగలపూడి అనిత బాధితురాలి ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు.
యువతి మరణించినట్టు వస్తున్న వార్తలు ఖండించిన పోలీసులు
దీపికకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఈ ఘటనలో యువతి కూడా మరణించినట్టు వార్తలు వస్తున్న క్రమంలో పోలీసులు యువతికి చికిత్స జరుగుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications