YS Viveka Case: అవినాష్ బెయిల్ పై ఉత్కంఠ, నేడే - పులివెందులలో స్పెషల్ ఫోర్స్..!!
వైఎస్ వివేకా కేసు విచారణలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంలో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు నిర్ణయం వచ్చే ఛాన్స్ ఉంది. సీబీఐ ముందు అవినాష్ హాజరు కానున్నారు. అవినాష్ ను అరెస్ట్ చేయద్దంటూ సుప్రీం ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుంది. సునీత భర్త రాజశేఖర్రెడ్డి విచారణ తరువాత పులివెందులలో సీబీఐ టీంలు విచారణకు రంగంలోకి దిగాయి. సాంకేతికంగా ప్రత్యక్ష పరిశీలన చేసారు. అవినాష్ బెయిల్ పై విచారణ..నిర్ణయం వేళ పులివెందులో అదనపు బలగాలను మొహరించారు.
సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ:సుప్రీంకోర్టులో ఈ రోజు కీలక విచారణ జరగనుంది. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల పైన సుప్రీం స్టే విధించింది. ఈ రోజు (సోమవారం) వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. తిరిగి నేడు విచారణ చేయనుంది. హైకోర్టు ఆదేశాల పైన వైఎస్ సునీత సప్రీంను ఆశ్రయించారు. ఈ నెలాఖరులోగా వివేకా కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. విచారణ సాగుతున్న వేళ హైకోర్టు ఆదేశాలపైన అభ్యంతరం వ్యక్తం చేసారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీం తప్పుబట్టింది. నేటి విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అవినాష్ బెయిల్ అంశం తో పాటుగా వివేకా కేసు విచారణ గడువు పైనా నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.

పలివెందులో సీబీఐ :సీబీఐ పలివెందులో మరోసారి విచారణ చేపట్టింది. అవినాష్ చెబుతున్న అంశాలపై ఫోకస్ చేసింది. సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని విచారించింది. పులివెందుల చేరుకున్న సీబీఐ టీంలు సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివేకా, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి గృహాలను సిబిఐ అధికారులు మరోమారు పరిశీలించారు. వీరి గృహాల మధ్య దూరాన్ని లెక్కించారు. వివేకా హత్య జరిగిన ఇంట్లోని బాత్రూమ్, బెడ్ రూమ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అవినాష్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలను పరిశీలించారు. హత్య జరిగిన రోజున భౌతికకాయాన్ని ఫొటోలు, వీడియోలు తీసి వివేకా కుటుంబ సభ్యులకు పంపిన వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయాతుల్లాను కారులో తీసుకొని వెళ్తూ విచారణ చేశారు.
కొనసాగుతున్న ఉత్కంఠ:ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన సుప్రీం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నేడు సుప్రీంలో జరిగే పరిణామాలు వివేకా కేసులో కీలకం కానున్నాయి. రేపు తెలంగాణ హై కోర్టు లో విచారణ ఉన్నా, నేటి పరిణామాల ఆధారంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా పులివెందులకు అదనపు పోలీసు బలగాలు చేరాయి. కోర్టు తీర్పు ఎలా ఉన్నా.. ఎటువంటి ఘటన లకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. కడప నుంచి రెండు వాహనాల్లో స్పెషల్ ఫోర్స్ పులివెందుల చేరుకుంది. ఈ పరిణామాల నడుమ నేడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ..నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications