హైదరాబాద్ లో భారీ వర్షాలు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్- పోలీసు అడ్వైజరీ..!!
హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో, పోలీసు అధికారులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు కీలక సూచనలు చేసారు. వర్షం సమయంలో ఒకేసారి అందరూ రోడ్లపైకి రాకుండా, ఉద్యోగులకు దశలవారీగా 'ఎర్లీ లాగౌట్' సౌకర్యం కల్పించాలని స్పష్టమైన సూచనలు చేశారు. అదే సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సూచించారు.
హైదరాబాద్ నగరంతో పాటు సైబరాబాద్ పరిధిలో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఐటి కారిడార్ ప్రాంతాల్లో వర్షం పడితే కిలోమీటర్ల మేర నిలిచిపోయే నరకప్రాయమైన ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ముందుస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐటీ కంపెనీల యాజమాన్యాలకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. సంస్థలు తమ ఉద్యోగులను ఏ సమయాల్లో ఎర్లీ లాగౌట్ చేస్తున్నారో ముందస్తుగా తమకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కంపెనీల వివరాలు, లాగౌట్ టైమింగ్స్ లభిస్తే, దానికి అనుగుణంగా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం సులువవుతుందని వెల్లడించారు.

పోలీసుల అడ్వైజరీ
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ చేసారు. త్వరగా లాగిన్ కావాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయిదు జిల్లాల్లో విద్యా సంస్థల కు సెలవు ప్రకటించారు. తెలంగాణలోని దాదాపు అన్ని రిజర్వాయర్లలో ఇన్ ఫ్లో పెరిగింది. అటు వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. ప్రభుత్వం సైతం జిల్లాల వారీగా వర్షాల వివరాలు.. చర్యల పైన నిరంతరం సమీక్ష చేస్తోంది.













Click it and Unblock the Notifications