అడ్డంగా దొరికిపోయిన దొంగ.. లైట్ ఆఫ్ చేయబోయి.. గుడిలో గంట మోగించాడు!
శ్రీకాకుళం: గత కొంత నెలల క్రితం ఓ దొంగ ఆలయంలో దొంగతనం చేసి.. ఆలయం గోడకు చేసిన కన్నంలో ఇరుక్కుని దొరికిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. ఆలయంలో దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలు అక్కడి లైట్స్ ఆఫ్ చేయబోయి.. గంట మోగించారు. దీంతో ఓ దొంగను పట్టుకున్ని స్థానికులు దేహశుద్ధి చేశారు.
శివాలయంలో చోరీకి ప్లాన్ వేసిన దొంగలు
శ్రీకాకుళం జిల్లాలోని మామిడివలసలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఇక్కడ ఓ పురాతన శివాలయం ఉంది. నిత్యం స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. హుండీలో కానుకలు కూడా వేస్తుంటారు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు దొంగలు ఈ ఆలయంలో చోరీ చేసేందుకు ప్లాన్ వేశారు.
లైట్లు ఆఫ్ చేయబోయి.. గంట మోగించిన దొంగలు
రాత్రిపూట ఆలయంలోకి చొరబడ్డారు. లైట్లు వేసి ఉండటంతో వాటిని ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. లైట్లు ఆఫ్ చేస్తే తమను ఎవరూ గుర్తించరని ఆ ప్రయత్నం చేశాడు ఓ దొంగ. అయితే, అతడు లైట్లు ఆఫ్ చేసే స్విచ్ఛ్కు బదులు.. విద్యుత్ గంటా మోగే స్విచ్ఛ్ను నొక్కాడు. ఇంకేముందు ఒక్కసారిగా గంట మోగడంతో సమీపంలో నిద్రిస్తున్న విద్యార్థులు, స్థానికులు ఉలిక్కపడి లేచారు.
దొంగను చితకబాదిన స్థానికులు.. స్తంభానికి కట్టేసి..
ఈ క్రమంలో అక్కడ్నుంచి పారియేందుకు ప్రయత్నించారు ఇద్దరు దొంగలు. అయితే, ఓ దొంగను పట్టుకున్నారు స్థానికులు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేసి.. స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే, రెండు నెలల క్రితం కూడా ఈ ఆలయంలో దొంగతనం జరగడం గమనార్హం. అప్పుడు హుండీని ఎత్తుకెళ్లారు దొంగలు. ఈసారి మాత్రం దొంగ దొరకడంతో కటకటాలపాలయ్యాడు.