దారి దోపిడీ ముఠా అరెస్టు: ప్యాసెంజర్స్ టార్గెట్

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేందుకు డబ్బు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వారం వ్యవధిలో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. బండ్లగూడ, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎట్టపోలు యాదగిరి అలియాస్ చందు (25) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నాగోల్, జైపురికాలనీకి చెందిన దరిపల్లి సాయికృష్ణ (22) హార్డ్వేర్ షాపులో, మరాఠి నరేష్కుమార్ (20) బోర్వెల్లో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి నగర శివారులో దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.
ప్రధాన నిందితుడు యాదగిరి ఆనంద్ అనే పేరుతో ఫైనాన్స్లో టాటా సుమో తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు చెల్లించలేకపోతున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలని సాయికృష్ణ, నరేష్కుమార్తో కలిసి పథకం రచించాడు. తన టాటా సుమో నెంబరును మార్పించాడు. ఒంటరిగా ఉన్న ప్రయాణికులను గమనించి విజయవాడ వెళ్తున్నామని ఎల్బీనగర్ రింగురోడ్డులో వీరు సుమోలో ఎక్కించుకుంటారు. నగర శివారులోని బాటసింగారం, రామోజీ ఫిల్మ్సిటీ, అబ్దుల్లాపూర్మెట్ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రయాణికులను రాడ్డుతో, కత్తులతో బెదిరించి వారి వద్ద నగలు, నగదు, విలువైన వస్తువులను దోచుకుంటారు.
ఇలా వారంలో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. కేసు దర్యాప్తు చేపట్టిన హయత్నగర్ పోలీసులు శుక్రవారం ఎల్బీనగర్ రింగురోడ్డులో కాపు కాచారు. ఏపీ 29 టీవీ 0372 నెంబరు గల సుమో ప్రయాణికుడ్ని ఎక్కించుకుంటుండగా మఫ్టీలో ఉన్న పోలీసులు చూశారు. పోలీసులను పసిగట్టిన ముఠా సభ్యులు వాహనాన్ని స్పీడుగా పోనిచ్చారు. పోలీసులు అప్రమత్తమై వారిని వెంబడించి హయత్నగర్ పోలీస్స్టేషన్ ముందు పట్టుకున్నారు.
నిందితులు ముగ్గురిని విచారించగా వారంలో నాలుగు చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారు. టాటా సుమోను సీజ్ చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకున్న వారిలో ఎస్ఐ మురళీకుమార్, డీఎస్ఐ యాదయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, నగేష్, పి.శివకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications