నిను చూడక నేనుండలేను: ఫొన్లో ప్రియురాలితో మాట్లాడుతూనే ప్రాణం వదిలాడు
ప్రేమికుల దినోత్సవం రోజైన (ఫిబ్రవరి 14)బుధవారంనాడు విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
విశాఖపట్నం: ప్రేమికుల దినోత్సవం రోజైన (ఫిబ్రవరి 14)మంగళవారంనాడు విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 'ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని ఉంది. దయచేసి ఒక్కసారిగా బయటకు రా. నిన్ను చూడకుండా ఉండడం నావల్లకాదు. ఈ బాధ భరించలేను. ఇది నీవు నమ్మవచ్చు.. నమ్మకపోవచ్చు. నేను అంటే నీకు ఇష్టంలేకపోవచ్చు. కానీ నా మనస్సు నీతో మాట్లాడాలంటుంది... నీవు రాకుంటే చనిపోవాలనుంది' అంటూ ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ప్రాణాలు వదిలాడు ఓ ప్రేమికుడు.
స్థానిక పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపురానికి చెందిన కర్రి దుర్గబాబు (22) మంగళవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో అచ్యుతాపురం మండలం యర్రవరం ఎస్సీ కాలనీకి ఎదురుగా రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి సర్పంచి గంగిరెడ్డి రాముకు తెలిపారు.
ముందు మద్యం తాగి పడిపోయి ఉంటాడని భావించినా.. నోటివెంట నురగలు రావడంతో అనుమానం వచ్చి స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. జేబులో ఉన్న సెల్ఫోను ఆధారంగా ఎలమంచిలి పట్టణంలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
దుర్గబాబు మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం నుంచి సెల్ఫోను మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రేమికుల రోజున ఎలాగైనా ప్రేయసిని కలవాలన్న పట్టుతో ద్విచక్రవాహనంపై ఉప్పవరం బయలుదేరి వచ్చాడు. తన ప్రేయసిని కలవడం సాధ్యంకాదని తెలిసి పురుగుల మందు తాగి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, చేతికందిన కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో దుర్గబాబు తల్లిదండ్రులు కర్రి ప్రకాశ్, తల్లి సీతాలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దుర్గబాబు రెండేళ్ల క్రితం సింగపూర్ వెళ్లి అక్కడ వెల్డర్గా పనిచేశాడు. అతడి అన్నయ్య గణేష్ ఇప్పటికే సైన్యంలో ఉద్యోగం చేస్తుండటంతో దుర్గబాబు కూడా సైన్యంలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఇప్పటికే పలు ఆర్మీ నియామక ర్యాలీల్లో కూడా పాల్గొన్నాడు. తుదిపరీక్షలు కూడా రాశాడు. సిపాయిగా దేశానికి సేవలందిస్తాడని భావించిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. బాబు మరణంతో అతని కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.