రఘురామ-పీవీ సునీల్ ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్- సీబీఐ జోక్యానికి లేఖ..!
రిటైర్డ్ డీజీ,మాజీ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) కూ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకూ (Raghurama Krishna Raju) మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. గతంలో రఘురామపై నమోదైన రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో సాక్ష్యుల్ని రఘురామ బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు కోరుతూ పీవీ సునీల్ తాజాగా సీబీఐని ఆశ్రయించారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కు ఆయన ఓ లేఖ రాశారు.
పెండింగ్లో ఉన్న రెండు సీబీఐ కేసులకు సంబంధించి సాక్షులను బెదిరించడం, ఆధారాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు, దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా రఘురామ పాల్పడుతున్న చర్యలపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ పీవీ సునీల్ సీబీఐ డైరెక్టర్ ను కోరారు. ఆంధ్రజ్యోతి పత్రిక గుంటూరు ఎడిషన్లో వచ్చిన ఓ వార్తను ప్రస్తావిస్తూ మాదాల శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదులో కనుమూరు రఘురామ కృష్ణరాజు తనను అపహరించేందుకు ప్రయత్నించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారని లేఖలో వివరించారు. ఈ ఘటన పెండింగ్లో ఉన్న సీబీఐ కేసుల్లో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పీవీ సునీల్ పేర్కొన్నారు.

భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 35 ప్రకారం, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదా సాక్షులను బెదిరించే పరిస్థితులు ఉన్నప్పుడు చట్టప్రకారం అరెస్టు వంటి చర్యలు తీసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని సునీల్ కుమార్ గుర్తు చేశారు. ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ఇతర సాక్షులు కూడా భయపడే అవకాశం ఉండటంతో పాటు, దర్యాప్తు నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా ఘటనను సీబీఐ స్వయంగా పరిగణనలోకి తీసుకోవాలని, సంబంధిత రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని, సాక్ష్యాలపై ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయా అనే అంశాన్ని విచారించాలని, అవసరమైతే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే దర్యాప్తు సమగ్రతను కాపాడేందుకు అవసరమైన ఇతర ఆదేశాలు జారీ చేయాలని పీవీ సునీల్ కోరారు.














Click it and Unblock the Notifications