"ఆచార్య" ఆదుకోండి - మెగాస్టార్ కు వేడుకోలు : దారుణంగా దెబ్బతిన్నాం..!!
"ఆచార్య" డిస్డ్రిబ్యూటర్లు ఇప్పుడు మెగాస్టార్ వైపు ఆశగా చూస్తున్నారే. సినిమా పైన భారీ అంచనాలతో ఏడాది ముందే వీరు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసారు. ఏరియాల వారీగా పంపిణీ దారులు ముందుగానే రిజర్వ్ చేసుకున్నారదు. భారీగా చెల్లింపులు చేసారు. కరోనా తరువాత భారీ అంచనాలతో వస్తున్న సినిమా కావటంతో..డిస్ట్రిబ్యూటర్లు సైతం అదే తరహాలో ఆలోచనలు చేసారు. చిరంజీవి తో పాటుగా ఆయన తనయుడు రాం చరణ్ కలిసి నటించిన సినిమా కావటంతో ఎక్కువగా లాభాలు వస్తాయని ఆశించారు. కానీ, పరిస్థితి తారుమారు అయింది.
ఈ సినిమా నిర్మాతలుగా కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటుగా నిరంజన్ రెడ్డి వ్యవహరించారు. అయితే, తాము మెగాస్టార్.. రాం చరణ్ కు ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. సినిమా తరువాత చూద్దామని వారే చెప్పారంటూ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. అయితే, సినిమాకు ప్రోత్సాహకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చాయి. కానీ, సినిమా విడుదల అయిన తరువాత డిజాస్టర్ టాక్ వచ్చింది. అంచనాలు మారిపోయాయి. సినిమా పరిశ్రమలో హిట్స్ ఎంత సాధారణమో..ఇలా కొన్ని డిజాస్టర్ మిగల్చటం కూడా కామన్ అంటూ చర్చలు మొదలయ్యాయి.
ఇక, గతంలో సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి... ఇలాంటి డిజాస్టర్ మూవీల విషయంలో నిర్మాతలక అండగా నిలిచారు. తాను తీసుకున్న పారితోషకాన్ని తిరిగి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు "ఆచార్య" మూవీ డిస్ట్రిబ్యూటర్లకు మెగాస్టార్ కు తమను ఆదుకోవాలంటూ లేఖలు రాస్తున్నారు. ఆచార్య సినిమాకు పెట్టిన పెట్టుబడిలో 25% కూడా రాలేదని, అసలే కరోనా వల్ల కుదేలైన తమ ఆర్ధిక పరిస్థితి, ఈ సినిమాతో మరింత అప్పులపాలు అయ్యామని, ఆదుకోవాలంటూ... మెగాస్టార్ చిరంజీవి కి రాయచూర్ సినీ డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ బజాజ్ రాసిన లేఖ వైరల్ అవుతోంది.
ఆ లేఖలో ఆయన ఏడాది ముందుగానే డిస్ట్రిబ్యూషన్ కోసం అప్పులు చేసి చెల్లింపులు చేసామని.. కానీ, ఇప్పుడు ఆశించిన స్పందన లేక..నష్టపోయామంటూ వాపోయారు. దీంతో..డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో ఉన్నారని..ఈ కష్ట సమయంలో ఆదుకోవాలని కోరారు. దీని ద్వారా భవిష్యత్ లో మెగాస్టార్ ప్రాజెక్టుల కోసం తాము తిరిగి నిలబడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మెగాస్టార్ ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ఆవేదన ..వారి అభ్యర్ధనల పైన చిరంజీవి ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.