మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి ముట్టడి, లాఠీఛార్జ్: వరంగల్లో కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: నల్గొండ జిల్లా సూర్యాపేటలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇంటిని సోమవారం ఏబివిపి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముట్టడి కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సుమారు 50మంది ఏబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విద్యార్థులు 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మరోసారి లాఠీఛార్జీ చేసిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు.
వరంగల్ అభివృద్ధిపై ముగిసిన సీఎం సమీక్ష
వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, స్పీకర్ మధుసూదనా చారి, పార్లమెంటరీ సెక్రటరీ వినయ భాస్కర్, కలెక్టర్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టెక్స్టైల్ పార్కు, ఇండస్ట్రియల్ కారిడార్, ఔటర్రింగ్ రోడ్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ నగర అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. ఔటర్రింగ్ రోడ్ ప్రతిపాదన నమూనాకు సిఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
వరంగల్ నగర అభివృద్ధితో సహా ఇతర అంశాలపై త్వరలో నివేదిక అందజేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు.