ACB Court:చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ..స్టే ఎలా తెచ్చుకున్నారన్న లక్ష్మీ పార్వతి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఏసీబీ సోదాలు చర్చనీయాంశమైంది. గురువారం రోజున ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పై ఆదాయపు పన్ను శాఖ విజయవాడ హైదరాబాదులోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ విచారణ చేయాలని పేర్కొంటూ గతంలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.
ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో కోరారు.ఇప్పటికే ఒకసారి కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలని లక్ష్మీ పార్వతి కోరారు. అప్పట్లో తనపై వేసిన కేసులకు సంబంధించిన చంద్రబాబు ఏ విధంగా స్టే తెచ్చుకున్నారో ఎలా వెకేట్ అయ్యిందో ఆ వివరాలను కోర్టుకు హాజరై లక్ష్మీ పార్వతి సమర్పించారు.
1978 నుంచి 2005 వరకు చంద్రబాబుకు ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు లక్ష్మీ పార్వతి. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఆస్తులకు సంబంధించి కేసు కూడా నమోదు కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న చంద్రబాబు అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులపై సమగ్ర విచారణకు ఆదేశం ఇవ్వాలని ఏసీబీ కోర్టును లక్ష్మీ పార్వతి కోరారు. ఇదిలా ఉంటే హైకోర్టులో ఇప్పటికే ఈ కేసులో స్టే ఉందని చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన లాయర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు స్టే వివరాలను పరిశీలిస్తామని ఏసీబీ కోర్టు తెలుపుతూ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.