ఉసురు తగులుతుందని హీరో శివాజీ: అది మేలేనన్న వెంకయ్య
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని బీజేపీ నేత, నటుడు శివాజీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పొద్దనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివాజీ మాట్లాడారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజల ఉసురు తగులుతుందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్టీలకతీతంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. పార్టీలన్నీ కలిసి ఏపీని పాతాళానికి తొక్కేశారని శివాజీ విమర్శించారు. త్వరలో తిరుపతి, విజయవాడ, విశాఖ, నెల్లూరు, గుంటూరులో విద్యార్థి విభాగం నాయకులు, యువకులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదిలావుంటే, భూసేకరణ చట్టం వల్ల రైతులకు ఉపయోగం కలుగుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ చట్టంలో తొమ్మిది సవరణలు చేశామన్నారు. భూసేకరణ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన చెప్పారు.
భూసేకరణ చట్టాన్ని రాష్ర్టాలు అమలు చేయవచ్చునని, లేదంటే పాత చట్టాన్నే కొనసాగించవచ్చని వెంకయ్య సూచించారు. పార్లమెంటు సమావేశాల తీరు ఫలప్రదంగా ఉందని ఆయన అన్నారు. గత పదేళ్లలో అత్యుత్తమంగా సభ జరిగిందన్నారు. గనుల బిల్లు వల్ల కొన్ని రాష్ర్టాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. చారిత్రాత్మక బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications