ఆలీకి సీఎం జగన్ బంపరాఫర్ - స్వయంగా వెల్లడి : పవన్ - మోహన్ బాబుకు జలక్..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రతీ నిర్ణయంలోనూ సామాజిక సమీకరణాలను పక్కాగా పాటిస్తున్న సీఎం ఇప్పుడు అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన ఆలీ పార్టీ తరపున ప్రచారం చేసారు. అయితే, సినీ ఇండస్ట్రీ సమస్యల పైన చర్చల వేళ..ఆలీకి సీఎంఓ నుంచి సమాచారం అందింది. సీఎంను కలిసేందుకు రావాలని ఆహ్వానించారు. చర్చల కోసం పిలిచి ఉంటారని భావించిన ఆలీకి సీఎం జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చారు.

వారంలో గుడ్ న్యూస్ అంటూ..
మరో వారంలో కలుద్దాం..గుడ్ న్యూస్ చెబుతానంటూ చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా జగన్ ఆలోచన ఏంటనేది స్పష్టత వచ్చింది. ప్రత్యేకంగా ఆలీని పిలిచి సీఎం జగన్ చెప్పటం ద్వారా..పదవి ఇవ్వబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవులు ఖాళీ లేవు. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లేదు. అయితే ఈ ఏడాది జూలైలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి..టీజీ వేంకటేష్...బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఉన్నారు. వారిలో విజయ సాయిరెడ్డికి తిరిగి వైసీపీ నుంచి రెన్యువల్ అయ్యే అవకాశం ఉంది. ఇక, బీసీ కోటాలో యాదవ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించనట్లుగా తెలుస్తోంది. ఇక, మూడో స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

మైనార్టీ కోటాలో ఆలీకి ఛాన్స్
అందులో భాగంగా ఆలీని రాజ్యసభకు వైసీపీ నుంచి పంపాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అదే విషయాన్ని సీఎం జగన్ ఆలీకి పరోక్షంగా వెల్లడించినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆలీకి మైనార్టీ కోటాలో ఇవ్వటం ద్వారా... రాజ్యసభకు మైనార్టీని పంపిన ఘనత తెలుగు రాష్ట్రాల్లో వైసీపీకి దక్కుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆలీకి జనసేన అధినేత పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ఆలీ వైసీపీలో చేరిన తరువాత వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగా ప్రచారం సాగింది. కానీ, తమ మధ్య ఎటువంటి గ్యాప్ లేదని కొద్ది కాలం క్రితం ఒక ఫంక్షన్ లో కలిసిన సమయంలో వారద్దరూ సంకేతాలు ఇచ్చారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మోహన్ బాబు సైతం పార్టీ కోసం ప్రచారం చేసారు.

మోహన్ బాబుకు దక్కని ఛాన్స్
పార్టీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ, మోహన్ బాబు మాత్రం తానెప్పుడూ పదవులు కోరుకోలేదని స్పష్టం చేసారు. కాగా... మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. ఆ సమయంలో బీజేపీలో చేరుతారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పలేనంటూ దాటేసారు. అప్పటి నుంచి మోహన్ బాబు - సీఎం మధ్య గ్యాప్ వచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. సినీ సమస్యల విషయంలోనూ ఎక్కడా మోహన్ బాబు ప్రమేయం లేదు. సీఎం స్వయంగా చిరంజీవిని ఆహ్వానించి..చర్చలు చేసారు. సమస్యల పరిష్కారం చిరంజీవి ద్వారానే జరిగిందనే ప్రచారానికి అవకాశం కల్పించారు.
Recommended Video

జగన్ పక్కా వ్యూహం...సామాజిక సమీకరణం
ఇక, ఇప్పుడు మోహన్ బాబును కాదని... ఆలీని ఏకంగా రాజ్యసభకు పంపటం ద్వారా జగన్ భారీ షాక్ ఇచ్చినట్లేననే చర్చ అప్పుడే టాలీవుడ్ లో మొదలైంది. 2019 ఎన్నికల్లో ఆలీ వైసీపీ నుంచి పోటీ చేయాలని భావించినా.. అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే భవిష్యత్ లో మంది అవకాశం దక్కుతుందంటూ సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. ఇక, ప్రస్తుతం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా మైనార్టీకి రాజ్యసభ కేటాయించటం ద్వారా మైనార్టీ వర్గాల్లో పార్టీ మైలేజ్ పెరుగుతుందని జగన్ అంచనాగా తెలుస్తోంది. తాజాగా.. మండలికి డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ మహిళను నియమించారు. ఇక, ఇప్పుడు మైనార్టీ కోటాలో ఆలీని రాజ్యసభకు పంపటం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. దీని పైన రానున్న వారం పది రోజుల్లో అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications