నటి జీవితకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా
హైదరాబాద్: సినీ నటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆమెకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో గతంలో జీవితకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది.
2012లో డిసెంబర్ నెలలో శేఖర్రెడ్డి వద్ద జీవిత రూ. 34 లక్షలు అప్పు తీసుకున్నారు. దానికి గాను ప్రామిసరీ నోట్లు, రెండు చెక్కులు, ఒక అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు. మూడు నెలల్లో అప్పు తీరుస్తామని చెప్పారు.
ఐతే ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో డబ్బును ఇవ్వాల్సిందిగా జీవితను ఎన్నోసార్లు కోరారు. జీవిత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా కోర్టులో విచారణ జరిగింది.
బెయిల్ మంజూరు
ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించిన విధంగా రూ.25 లక్షల జరిమానాను ఆమె డిపాజిట్ చేశారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. నిర్మాత శేఖర్ రెడ్డే తనను మోసం చేశారని ఆరోపించారు. ఆయన తనకు డబ్బివ్వాలన్నారు. ఈ కేసులో అవసరమైతే సుప్రీం కోర్టు వరకూ వెళ్తానని చెప్పారు.
తనకు కోర్టు జైలు శిక్ష విధించిందంటూ చానళ్లలో పుకార్లు పుట్టించారని మీడియాతో అన్నారు. 'ఎవడైతే నాకేంటి' సినిమాకు తాను దర్శకురాలినని, శేఖర్ రెడ్డి నిర్మాత అని, అలాంటిది ఆయనకు తానెలా డబ్బులివ్వాలని ప్రశ్నించారు. కాబట్టి కోర్టు తనకు ఎలాంటి శిక్ష వేయలేదని, న్యాయస్థానంపై గౌరవంతోనే డబ్బులు డిపాజిట్ చేశానని తెలిపారు.